ఒకే రకమైన పంట సాగుతో నేలల్లో సారం దెబ్బతిని దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టాల పాలవుతున్నారు. రైతుబంధు, నిరంతర కరెంట్, నీటి లభ్యత పుష్కలంగా ఉన్నా ఏ పంట వేయాలనే విషయంలో సరైన అవగాహన లేక అన్నదాతలు దెబ్బతింటున్నారు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. గతేడాదితో పోలిస్తే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే, ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో వరి స్థానంలో ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆముదం, శనగ, వేరుశనగ, నువ్వులు, కంది, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలను సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మన నేలలు ఈ పంటల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కావాల్సిన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది.
ఏ పంటలేద్దాం..
సిద్దిపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో ఏ ఏ పంటలు సాగుచేయాలి. ప్రత్యామ్నాయ పంటల సాగు వివరాలు.. తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్ కుమార్తో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. గురువారం ఉదయం 10 నుంచి 11గంటల వరకు 7288894415 నంబర్కు ఫోన్ చేసి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. యాసంగిలో వరికి బదులుగా ఏ పంటలు వేయాలి, ఎరువులు, విత్తనాలు తదితర ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెబుతారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇతర పంటల సాగులో మెళకువలు, తదితర విషయాలు తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ ఫోన్ఇన్’ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేసే దిశగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్నదాతల శ్రేయస్సు కోసం అనేక పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నది. కాగా, వానకాలంలో పండించిన వడ్లను కేంద్ర సర్కార్ కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అప్రమత్తం చేస్తున్నది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నది. సాంప్రదాయ ఆరుతడి పంటల సాగుతో లాభాలు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా ఎప్పుడూ ఒకే పంట వేయడంతో నేల సారాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున పంట మార్పిడి చేపట్టాలని సూచిస్తున్నారు..
సిద్దిపేట, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు యాసంగి సాగంటే అన్ని పంటలు కలిపి రెండు, మూడు లక్షల ఎకరాల వరకే సాగయ్యేది. ప్రస్తుతం పుష్కలంగా నీరు, ఫుల్ కరెంట్ ఉండడంతో రెండు, మూడేండ్ల నుంచి యాసంగి సాగు ఏటికేడు పెరుగుతున్నది. రైతులంతా ఒకే రకమైన పంట వేయడంతో కొనుగోలు సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయమని ఖరాఖండీగా చెప్పింది. దీంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. పంట వేసిన రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసే దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే వరి సాగు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో వరి సాగును తగ్గించి ఉద్యాన పంటలు సాగుచేసేలా రైతులను అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.
మొన్నటి వానకాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 9,55,600 మంది రైతులు 15,75,904 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. సిద్దిపేట జిల్లాలో 5,32,827 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో వరి అత్యధికంగా 3,12,927 ఎకరాల్లో సాగైంది. పత్తి పంట 1,26,625 ఎకరాల్లో సాగుచేయగా, మిగతా అన్నిరకాల పంటలు సాగుచేశారు. మెదక్ జిల్లాలో 3,30,694 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండించారు. ఇందులో 2,56,207 ఎకరాల్లో వరి ఉండడం విశేషం. కేవలం 53,102 ఎకరాల్లో పత్తి పంట, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,12,383 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 1,12,138 ఎకరాల్లో వరి పంట వేశారు. అత్యధికంగా 3,61,099 ఎకరాల్లో పత్తి పంటను పండించారు. ఈసారి పత్తి పంటకు మార్కెట్లో మంచిధర పలుకుతుండడంతో సంగారెడ్డి జిల్లా రైతులకు లాభసాటిగా మారింది.
నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగుచేయాలి..
రైతులు తమ భూమిలో ఏ పంటలను సాగుచేయాలో ముందే నిర్ణయించుకోవాలి. నేల స్వభావం, విత్తే సమయం, నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఎర్రనేలలు ఉన్న భూమిలో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, వినుములు, కుసుమ పంటలు వేసుకోవచ్చు. నల్లరేగడి భూమిలో ఆముదం, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, నువ్వులు పండించవచ్చును. రైతు విత్తే సమయం ఆధారంగా, తమ నేలలు నీటి వసతి ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి, వాతావరణం, కోతులు, ఆడవిపందుల బెడదతో పాటు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు వేసుకుంటే రైతులు మంచిఫలితాలు సాధించవచ్చును.
ఏండ్ల తరబడి ఒకే రకమైన పంట సాగు..
ఒకే నేలలో ఒకే రకమైన పంటను ఏండ్ల తరబడి సాగుచేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంట మార్పిడి విధానం పాటించకపోవడంతో దిగుమతులపై ప్రభావం చూపుతున్నది. ప్రతి రైతు తప్పక పంట మార్పిడీ పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం ఎర్రనేలలు ఉండగా, ఆ తర్వాత స్థానంలో నల్లరేగడి నేలలున్నాయి. ఈ నేలలకు అనుకూలంగా పంటలను సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కొన్నేండ్లుగా ఒకే రకమైన పంటలను వేయడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. సాగు వైవిధ్యం దెబ్బతింటున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ పంట మార్పిడి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి లాభాలు పొందాలి. ఇందుకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. ఏ నేలలో ఏ పంట వేయాలి..? ఏపంట ఎంత కాలం..? నీటి వసతి గల దాంట్లో ఏ పంటలు వేయాలి. అనే వివరాలను రైతులకు క్షుణ్ణంగా వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర పంటలను సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట మార్పిడి ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. నేలలో నిక్షిప్తమయ్యే రసాయన ఎరువులు పైర్లకు ఉపకరిస్తాయి. పంటలను ఆశించే చీడపీడల సంతతి నివారించబడి పైర్లపై తీవ్రత తగ్గుతుంది. పంట పంటకు వేర్వేరుగా ఉండే కలుపు మొక్కలు నివారించబడతాయి. ఫలింతగా పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
నువ్వులు..
నువ్వుల పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 2కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. సారవంతమైన తేలికపాటి నేలలో ఈ పంటను వేసుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మూడు నెలల పంట. ఎకరాకు సుమారు 3 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో మంచి ధర ఉంది.
శనగ..
శనగ పంటను ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 25-30 కిలోలు అవసరం అవుతాయి. నల్లరేగడి నేలల్లో అనువైన పంట ఇది. ఈ పంట కాలం మూడు నెలలు. ఎకరాకు సరాసరిగా 8 క్వింటాళ్ల పైనే దిగుబడి వస్తుంది. మంచి డిమాండ్ ఉన్న పంట. నీటి వసతి తక్కువ.
పొద్దుతిరుగుడు ..
ఈ పంటను సాగు చేయడానికి మన నేలలు ఎంతో అనువైనవి. నవంబర్ నుంచి డిసెంబర్ రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 25-30 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ పంట ఎర్రనేలలో మంచి దిగుబది వస్తుంది. దీని సాగు ఖర్చు తక్కువగానే ఉంటుంది.
పల్లి, మొక్కజొన్న ..
పల్లి పంటను ఈనెలలో చివరి వరకు విత్తనం వేసుకోవచ్చు. ఎకరాకు 60-80 కిలోలు(గింజలు) వివిధ రకాల కంపెనీలకు చెందిన విత్తనాలు లభ్యమవుతాయి. రైతుల వద్ద కూడా ఉంటాయి. ఈ మాసంలో పల్లి, మొక్కజొన్న పంటలను సాగు చేసుకోవచ్చు. ఈ పంటలు 95 నుంచి 120 రోజుల్లో చేతికి వస్తాయి. పల్లి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మొక్కజొన్న ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండి ఎక్కువ దిగుబడి వస్తుంది.