‘మెతుకు సీమ’ వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. ఏడాదికి రెండు సార్లు వరి పంటలే రైతులు పండిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. అంతే కాదు కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనలేమని కచ్చితంగా చెప్పడంతో రైతులు ఇతర పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. మక్క, ఉల్లి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, బంతి, జొన్న, కుసుమలు వేస్తున్నారు. కొంత మేర కూరగాయలు పెట్టుకున్నారు. ఇలా రైతులు ఇతర పంటలు వేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో జిల్లా రైతులు చాలా వరకు పంటల మార్పుపై దృష్టి పెడుతున్నారు.
మెదక్, డిసెంబర్ 5 : ఏండ్లుగా వరి ధాన్యాన్ని పండిస్తూ అందరికీ పట్టెడన్నం పెడుతున్న రైతన్నలు మొదటి సారి వరిని దూరం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లా రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టారు. అధికారులు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యాసంగి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పడంతో జిల్లా వ్యవసాయ అధికారులు ఈ సీజన్లో అనువైన వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా రకాల విత్తనాలను జిల్లాలో పంపిణీ చేస్తున్నారు.
జిల్లాలో ఆరుతడి పంటలు ఇలా..
మెదక్ జిల్లాలో యాసంగిలో రైతులు ఆరుతడి పంటలను వేసుకుంటున్నారు. ఇందులో శనగ 900 ఎకరాలు, వేరు శనగ వెయ్యి ఎకరాలు, జొన్న 250 ఎకరాలు, మొక్కజొన్న 200 ఎకరాలు, కుసుమలు 70 ఎకరాలు, పొద్దుతిరుగుడు 150 ఎకరాలు, కూరగాయలు 800 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అయి తే వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం
వరి సాగు కోసం ఎకరాకు 120 మీ.మీ నీరు అవసరం కాగా, ఎకరా వరి పండించే నీటితో 45 ఎకరాల స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించవచ్చు. అతి తక్కువ నీటితో కూరగాయలు, కుసుమలు, ఉల్లి పండించడం ఉత్తమం. యాసంగిలో తేమను తక్కువగా నిలుపుకొనే శక్తి ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలపరిమితి కలిగిన మినుములు, పెసర విత్తుకోవచ్చు. తెల్ల కుసుమ పంటలను నవంబర్, డిసెంబర్ వరకు నీరు నిల్వ ఉండని ఎర్ర పొలాలు, నల్లరేగడి నేలల్లో వేసుకోవచ్చు. తెల్ల కుసుమ పంట ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాగు ఖర్చు కూడా తక్కువే అని అధికారులు తెలిపారు.
ఇంటి కోసం కొంత వరి సాగు..
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనలేమని ఖరాకండిగా చెప్పిన తర్వాత వరి పంటను సాగు చేసి ఇబ్బందులు పడటం ఎందుకన్న ధోరణి కూడా చాలా మంది రైతుల్లో కనిపిస్తోంది. ధాన్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేయకపోయినా కనీసం తమ ఇంటి అవసరాలకైనా ఉపయోగపడే పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఆరుతడి పంటలే మేలు ..
యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశనగ, కుసుమ, మక్క, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేసుకోవచ్చు. ఆరుతడి పంటలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు. విత్తనాలను సైతం అందుబాటులో ఉంచాం. యాసంగిలో ఆరుతడి పంటలపై ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి
-పరశురాంనాయక్, మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
వేరుశనగతో అధిక లాభాలు
యాసంగిలో వేరుశనగ పంట వేస్తే అధిక లాభాలు వస్తాయి. తక్కువ నీటితో వేరుశనగ పంట ను పండించవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సలహాలతో పంట సాగు చేశా. ఆరుతడి పంటలపైనే దృష్టి పెట్టాం.
-సత్తయ్య, రైతు సోమక్కపేట
రెండున్నర ఎకరాల్లో బంతి వేశా..
యాసంగిలో రెండున్నర ఎకరాల్లో బంతి పంటను సాగు చేశా. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు ఇతర పంటల వైపు మొగ్గు చూపాను. పంట వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన వెబ్సైట్లో నమోదు చేశా.
-తొడునురి ప్రశాంత్, రుక్మాపూర్,
చేగుంట మండలం