ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున చాలా మంది క్రీడాకారులు పతకాలతో మెరిశారు. వారిలో ఢిల్లీకి చెందిన దివ్య కక్రాన్ కూడా ఒకరు. ఈ 23 ఏళ్ల రెజ్లర్కు అక్కడి ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. పతకం సాధించిన తర్వాత ఇదే విషయాన్ని బయటపెట్టిన ఆమె.. ‘‘మిగతా రాష్ట్రాల్లో క్రీడాకారులకు ఎంతో సహాయం అందుతోంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం నాకు ఎలాంటి సాయం చెయ్యలేదు’’ అని వెల్లడించింది.
దీనిపై ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ‘‘నేను పొరబడుతున్నానేమో తెలియదు కానీ.. మీ వివరాల కోసం నేను వెతికాను సోదరీ. మీరు ఢిల్లీ తరఫున ఇప్పటి వరకు ఆడలేదు. ఆడిన ప్రతిసారీ ఉత్తరప్రదేశ్ తరఫునే ఆడారు. ఇప్పుడు మొత్తం దేశం దృష్టి మీపై ఉంది. మీరు మరింత ముందుకు వెళ్లాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా‘‘ అని ట్వీట్ చేశారు.
దీంతో షాకైన దివ్య కూడా వెంటనే రిప్లై ఇచ్చింది. తను ఢిల్లీ తరఫున పోటీలో పాల్గొన్నట్లు ఉన్న సర్టిఫికెట్ను ట్వీట్ చేసింది. ‘‘2011 నుంచి 2017 వరకు ఢిల్లీ తరఫునే ఆడుతూ వచ్చాను. ఇదిగో సర్టిఫికెట్. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే.. ఢిల్లీ తరఫున 17 గోల్డ్ మెడల్స్ గెలిచిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. అవి కూడా అప్లోడ్ చెయ్యమంటారా?’’ అని ఆమె సూటిగా అడిగేసింది.
నెట్టింట ఈ గొడవను పరిశీలించిన నెటిజన్లు సదరు ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్నారు. తప్పు జరిగినప్పుడు దాన్ని హుందాగా అంగీకరించాలి కానీ.. ఇలా గోల చేసి పరువు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
2011 se 2017 tak me delhi se khelti thi ye raha certificate delhi sate ka !
Ager apko abhi bhi yakin nahi to delhi sate se 17 Gold h mere vo certificate bhi upload karu https://t.co/0PXYp7NWR0 pic.twitter.com/H7dwTWsSx7— Divya kakran (@DivyaWrestler) August 9, 2022