హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ బడులు బాగుపడొద్దా? అవి అలాగే గబ్బుపట్టి పోవాలా? అవి అలాగే ఉండాలని మీరు కోరుకొంటున్నారా? కోరుకొంటే ఏసీడీఎఫ్ నుంచి నిధులు ఇవ్వొద్దని చెప్పండి’ అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ బడుల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి నిధులు కేటాయించలేదని, ఎమ్మెల్యే నిధుల నుంచి (ఏసీడీఎఫ్) నుంచి కేటాయిస్తున్నదని భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు బడులు బాగు చేయడం ఇష్టం లేకపోతే ఏసీడీఎఫ్ నుంచి నిధులు ఇవ్వొద్దని చెప్పండి అని డిమాండ్చేశారు. ఎమ్మెల్యే నిధులను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దేనని పేర్కొన్నారు. మన ఊరు-మన బడికి ప్రభుత్వం రూ.7,300 కోట్లు కేటాయించిన విషయం భట్టికి తెలియంది కాదని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ నిధులైనా ప్రజల అభివృద్ధి కోసమేనని, ప్రజా ప్రతినిధుల ఆస్తులమ్మి నిధులు తేవడం లేదని స్పష్టంచేశారు. ప్రజల సొమ్ముకు ప్రభుత్వంలో ఉన్నవారు ధర్మకర్తలు మాత్రమేనని గుర్తుచేశారు. మంచిని మంచిగా స్వీకరించి, మంచి జరిగిందని చెప్పినప్పుడే సభ్యుల గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
50 ఏండ్లపాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ 150 గురుకులాలు ఏర్పాటుచేస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలోనే ఏకంగా 975 గురుకులాలను ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ పేద పిల్లలు గురుకులాల్లో చదివి నీట్, జేఈఈ వంటి జాతీయ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి జీవితంలో ఎదుగుతున్నారని తెలిపారు. ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన చేశారని, త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని చెప్పారు.
టీఎస్ బీపాస్ వెబ్సైట్ ద్వారా ఎవరైనా, ఎక్కడినుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇండ్ల నిర్మాణ అనుమతి కోసం టీఎస్బీపాస్లో కొన్ని చోట్ల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నదని, దరఖాస్తులు పెండింగ్లో ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనడంలో నిజం లేదని స్పష్టంచేశారు. శనివారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ టీఎస్బీపాస్ వచ్చిన తర్వాత ఇండ్ల నిర్మాణ అనుమతి కోసం ఎవరికీ లంచం ఇవ్వకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండాపోయిందని చెప్పారు. 600 గజాల లోపు స్థలంలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు 75,722 దరఖాస్తులకు అనుమతి జారీ చేసిననట్టు తెలిపారు. 600 గజాలకు పైగా 9,175 దరఖాస్తులకు, 406 లేఔట్లకు అనుమతి ఇచ్చినట్టు వివరించారు.