యాదాద్రి, ఏప్రిల్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర సన్నిధిలో ఈ నెల 20న ఉదయం 9 గంటలకు మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. సోమవారం యాదాద్రిలో ఈవో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 25 వరకు స్మార్తాగమ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. శివాలయం ప్రతిష్ఠ, ఉపదేవీదేవతల ప్రతిష్ఠతో 21 నుంచి ఐదురోజులపాటు పాంచాహ్నిక దీక్షా విధానంతో పంచకుండాత్మక రుద్రయాగం జరిపిస్తామని వెల్లడించారు. ఈ నెల 25న ఉదయం 10:25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వివరించారు. వేములవాడ, బాసరతోపాటు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందం పాల్గొంటుందని వెల్లడించారు. ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.