హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో సెలెబ్రిటీలకు టోపీ పెట్టి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి పోలీసు కస్టడీ పొడిగించాలనే పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. శిల్పా చౌదరిపై ఒక హీరో భార్య ఫిర్యాదు చేయడంతో ఈ మోసాలు బయటపడిన సంగతి తెలిసిందే.
తమను మోసం చేసి రూ.2.9 కోట్ల నగదు ఎగ కొట్టారంటూ సదరు హీరో భార్య ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శిల్పా చౌదరితోపాటు ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. కిట్టి పార్టీల సందర్భంగా శిల్ప తమకు పరిచయమైందని బాధితురాలు తెలిపింది.
ఈ కిట్టి పార్టీల్లో పాల్గొన్న చాలా మంది మహిళల నుంచి శిల్ప ఇలాగే డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. డబ్బుల కోసమే శిల్ప.. ప్రతి వీకెండ్లో కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేది. శిల్పా చౌదరి విషయం తెలియడంతో ఇప్పుడు ఎంతోమంది బాధితులు బయటకు వస్తున్నారు. తాము మోసపోయామని చెప్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికి మూడు కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ విషయంపై స్పందించారు. శిల్పా చౌదరిని తిరిగి కస్టడీలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయని, శిల్ప సంబంధించిన రెండు అకౌంట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేశామని అధికారులు తెలిపారు.
శిల్పకు మరికొన్ని అకౌంట్లు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంత డబ్బును శిల్ప ఎక్కడికి తరలించిందనే కోణంలో విచారణ సాగుతోందని పేర్కొన్నారు.