హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం డీడీలు చెల్లించినవారికి గొర్రెల యూనిట్లను అందిస్తామని చెప్పారు. వచ్చేనెల 15 వరకు ఉచిత చేప పిల్లల పంపిణీని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని కార్యాలయంలో పశు సంవర్ధక, మత్స్యశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పటివరకు 2,797 మంది పూర్తి డీడీలు చెల్లించారని తెలిపారు. వీరందరికీ గొర్రెలను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. మిగతావారు కూడా పూర్తి డీడీలు చెల్లించి గొర్రెలు పొందాలని సూచించారు. నవంబర్ 15 వరకు ఉచిత చేపల పంపిణీ పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఇప్పటివరకు 13,043 నీటి వనరుల్లో 32.26 కోట్ల చేప పిల్లలను, 12.60 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు. మత్స్య ఫెడరేషన్ ద్వారా కొరమేను చేపల పెంపకం చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ పాల్గొన్నారు.