న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన ఎంపీ శశి థరూర్కు ఆయన స్వరాష్ట్రం కేరళలో కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు కరువైంది. అధ్యక్ష పదవికి మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నా శశి థరూర్ అభ్యర్ధిత్వానికి సీనియర్ నేతలు ఎవరూ మద్దతివ్వడం లేదు. రాహుల్ గాంధీనే తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని పలువురు నేతలు కోరుతున్నారు. రాహుల్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు మళ్లీ అప్పగించాలని ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు ఆమోదించిన సంగతి తెలిసిందే.
శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉండరాదని, ఆయన అంతర్జాతీయ వ్యక్తని లోక్సభలో కాంగ్రెస్ చీఫ్విప్ కే సురేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని తాము ఇప్పటికీ రాహుల్ను కోరుతున్నామని అన్నారు. రాహుల్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని పలువురు నేతలు చెబుతున్నారు. శశి థరూర్ పోటీ చేస్తారని తాననుకోవడం లేదని, ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అనుసరించాలని పార్టీ ఎంపీ బెన్నీ బెహనన్ అన్నారు.
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం లేదా అధ్యక్ష పదవికి ఏ ఒక్కరూ నామినేషన్ వేయకుండా నిర్ణయాన్ని సీడబ్ల్యూసీకి వదిలివేయడం, నామినేషన్లు దాఖలైతే ఎన్నిక ద్వారా అధ్యక్షుడి ఎంపిక వంటి ఆప్షన్లను పార్టీ పరిశీలిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పోటీ అనివార్యమైతే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి.