పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ.. శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో లంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది. సొంతగడ్డలాంటి చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను విరాట్ కోహ్లీ నిరాశపర్చగా..మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేని చోట అయ్యర్ అదుర్స్ అనిపించాడు. అనంతరం ఫ్లడ్లైట్ల వెలుతురులో బ్యాటింగ్కు దిగిన లంక తొలి రోజే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగిలిన నాలుగు వికెట్లతో లంకేయులు ఏమాత్రం పోరాడుతారో చూడాలి!
బెంగళూరు: సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. మరోసారి ఆల్రౌండ్ షో కనబర్చింది. శ్రీలంకతో రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో రోహిత్ సేన పూర్తి ఆధిపత్యం చాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. రిషబ్ పంత్ (39; 7 ఫోర్లు), హనుమ విహారి (31) ఫర్వాలేదనిపించారు. రెండేండ్లుగా అంతర్జాతీయ శతకం నమోదు చేయని విరాట్ కోహ్లీ (23).. తనకు సెకండ్ హోమ్ లాంటి బెంగళూరులోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్పై లంకేయులు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. సీనియర్ ఆల్రౌండర్ ఎంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్ కాగా.. కుషాల్ మెండిస్ (2), దిముత్ కరుణరత్నె (4), లహిరు తిరుమనె (8), ధనంజయ డిసిల్వా (10), అసలంక (5) పెవిలియన్కు వరుస కట్టారు. గులాబీ బంతితో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా (3/15), మహమ్మద్ షమీ (2/18) నిప్పులు చెరిగారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న లంక.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 166 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం డిక్వెల్లా (13), ఎంబుల్దెనియా (0) క్రీజులో ఉన్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 252 (శ్రేయస్ అయ్యర్ 92, పంత్ 39; ప్రవీణ్ 3/81, ఎంబుల్దెనియా 3/94), శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 86/6 (మాథ్యూస్ 43; బుమ్రా 3/15, షమీ 2/18).