తుంగతుర్తి, నవంబర్ 21: గిరిజన మహిళపై ఇటీవల పలువురు సామూహిక లైంగికదాడికి పాల్పడగా.. బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (36) భర్త నుంచి వేరుగా ఉంటూ కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తున్నది. గ్రామంలోనే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నది. ఈ నెల 17న రాత్రి అదే గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లానాయక్.. ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆ రాత్రి అతనితోపాటు మరో ఇద్దరు బాధితురాలిపై లైంగిక దాడిచేశారు. అనంతరం తీవ్ర కడుపునొప్పి, వాంతులతో ఈ నెల 19న ఉదయం బాధితురాలు తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స పొందింది. అయినా పరిస్థితి మారకపోవడంతో ఆమెను సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. బాధితురాలి కుమార్తె, కొడుకు ఫిర్యాదు మేరకు తుంగతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు. మహిళ మృతితో కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. నిందితుడు సోమ్లానాయక్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు.