లక్నో: యూపీలోని అయోధ్యలో ఉన్న మసీదుల్లో అభ్యంతరకరమైన పోస్టర్లు, వస్తువుల్ని పడేసిన ఘటనలో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతికి భంగం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై వాళ్లు అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో మహేశ్ కుమార్ మిశ్రా, ప్రత్యూష్ శ్రీవాత్సవ్, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌర్, బ్రిజేశ్ పాండే, శత్రుఘ్న ప్రజాపతి, విమల్ పాండేలు ఉన్నారు.వీళ్లంతా అయోధ్య నగరానికి చెందినవాళ్లే. 11 మంది వ్యక్తులు మసీదుల్లో అభ్యంతరకర వస్తువుల్ని జారవిడిచారని, దీంతో ఏడుగుర్ని పట్టుకున్నట్లు అయోధ్య ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
బైక్లపై వెళ్తూ మసీదుల్లో పోస్టర్లు, వస్తువుల్ని విసిరేశారని, వాళ్లపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహేశ్ కుమార్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కశ్మీర్ మొహల్లా, తత్షా మసీదు, గోసియానా రామ్నగర్ మసీదు, ఈద్గా సివిల్ లైన్ మసీదు, గులాబ్ షా దర్గా, దర్గా జైల్ మసీదుల్లో వస్తువుల్ని పారేసినట్లు పోలీసులు తెలిపారు.