జూబ్లీహిల్స్,ఫిబ్రవరి19: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో బయో మెడికల్ ఏజెన్సీలతో వ్యర్థాలను వేరుచేసే పనులు చేపడుతున్నారు. పీహెచ్సీల్లో ప్రత్యేకమైన రంగులతో బిన్ల ఏర్పాటు చేసి వ్యర్థాలను సులువుగా వేరుచేయనున్నారు. ఇందుకుగాను పీహెచ్సీలలో ఎరుపు, నలుపు, నీలం, పసుపు తదితర రంగులతో బిన్లను ఏర్పాటు చేశారు. సంబంధిత వ్యర్థాలను వైద్య సిబ్బంది ఆయా డబ్బాల్లో మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ఏజెన్సీలు సదరు వ్యర్థాలను ప్రత్యేక కవర్లలో తరలిస్తాయి. ఈ మేరకు శనివారం బోరబండ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీవల్లి ఆధ్వర్యంలో బయో మెడికల్ ఏజెన్సీ ప్రతినిధులు వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటికే వైద్య వ్యర్థాల నిర్వహణకు వివిధ రంగులతో ఉన్న డబ్బాలను శ్రీరాంనగర్ క్లస్టర్ కార్యాలయం నుంచి అన్ని పీహెచ్సీలకు తరలించినట్లు ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తెలిపారు.