అది ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతం.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలోని మారూమూల గ్రామాలు. అందులో 56 ప్రభుత్వ పాఠశాలలు. పలక, బలపం పట్టాల్సిన చేతులు పేదరికంతో బడికి దూరమవుతున్న సందర్భాలు అనేకం. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లిన ఓ తాత పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని మాట కలపాడు. రోజూ బడికి వస్తే బట్టలు, బ్యాగులు, పెన్నులూ ఇస్తానని నమ్మబలికాడు. తాత మాటలకు మురిసిన చిన్నారులు ఉదయాన్నే బడికి రెడీ అయ్యారు. ‘ఇంట్లో బడికి వద్దు..’అని చెప్పిన తల్లిదండ్రులతో మారం జేసి మరీ స్కూలుకెళ్లారు. కానీ అక్కడ తాత కనిపించలేదు. అంతా ఉట్టిదే అనుకుంటున్న సమయంలో ఓ బండిని నెట్టుకుంటూ తాతా స్కూల్ లోపలకు ఎంట్రీ అయ్యాడు. ఆ బండి పేరు తోపుడు బండి. ఆ తాత పేరు సాధిక్. ఆ బండిలో స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, క్రీడాసామగ్రి, బట్టలు, పలకలు ఉన్నాయి. వాటన్నింటిని సేకరించింది సోషల్ మీడియాతోనే. అవి పంపించింది అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఉన్న సేవామూర్తులు. ఇప్పుడు ఈ బండి మన హైదరాబాద్కు వచ్చింది.
నగరవాసుల కానుకలను మోసుకెళ్లడానికి..
చిన్నారుల చిరునవ్వే ఇంధనంగా.. వారి లక్ష్యాలను నెరవేర్చడమే చక్రాలుగా… తోపుడుబండి ప్రయాణం సాగుతుంది. 2015 ఫిబ్రవరిలో పుట్టిన తోపుడు బండి రోజు రోజుకు వేలాది మంది విద్యార్థుల పురోగతికి కారణమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని వేలాది మంది విద్యార్థులకు సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యతను భుజానఎత్తుకుంది. ప్రతీ గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు కావాల్సిన వనరులు సమకూర్చుకుంటూ సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడానికి కారణమవుతుంది. కల్లూరు మండలంలోని 56 గ్రామాల్లోని ప్రతీబడిని సొంతబడిగా భావిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు చేయూతనందిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించగలరో ప్రపంచానికి చూపించాలని కంకణం కట్టుకుంది. ఈ మహాయజంలో అందరూ కలిసి రావాలని తోపుడుబండి వ్యవస్థాపకులు సాధిక్ పిలుపునిచ్చారు.
నగరంలో తోపుడుబండి..
మూడు రోజుల పాటు నగరంలో తోపుడుబండి పర్యటించనుంది. భాగ్యనగర వీధుల్లో తిరుగుతూ నోట్బుక్స్, బ్యాగ్లు, బట్టలు, క్రీడాసామగ్రి, బొమ్మలు, బెంచీలు, మ్యాట్స్, పెన్నులు, పెన్సిళ్లు వంటి సామగ్రి కోసం వెతుకుతుంది. ఈ తోపుడుబండికి నగరవాసుల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. సోషల్మీడియాతో సాదిక్ తన ఆలోచనలను పంచుకుంటున్నారు. పిల్లల నవ్వులు.. వారికి సమకూరుతున్న వసతుల ఫొటోలను చూసిన నెటిజన్లు విరివిగా సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. విదేశాల నుంచి కూడా తమకువీలైనంత చేదోడుగా నిలుస్తున్నారు. ‘గూడెంలో గుప్పెడు మెతుకులు’ పేరుతో తోపుడుబండి పిల్లల ఆకలి తీర్చుతుంది. వీటితో పాటు ప్రతీ గ్రామంలో ఓ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి పుస్తకాలను సేకరిస్తోంది. స్మార్ట్ టీవీ, 90 సైకిళ్లు, 10 కంప్యూటర్లు, దుప్పట్లు, బట్టలు, స్టేషనరీ తదితర సామగ్రిని నగరవాసులు ఇప్పటికే అందించారు. అవన్నీ ఎప్పటికప్పుడు కల్లూరుకు చేరుతున్నాయి.