హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ): కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కోసం ఏర్పాటైన కేటాయింపు కమిటీ ఆదివారం 16 హెచ్వోడీల్లోని ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేసింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, ఆర్థికశాఖ సీనియర్ కన్సల్టెంట్ ఎన్ శివశంకర్తోపాటు ఆయా హెచ్వోడీలతో కూడిన కమిటీ సచివాలయంలో భేటీ అయ్యింది. జీవో 317 మార్గదర్శకాల ప్రకారం 2,500 మంది ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేసింది. ఈ ప్రక్రియను సీఎస్ సోమేశ్కుమార్ సమీక్షించారు. కేటాయింపు ప్రకారం హెచ్వోడీలు అందరూ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ప్రొసీడింగ్స్ను అప్లోడ్ చేయాలని జీఏడీ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన శాఖల్లో ఆయా ఉద్యోగులందరికీ సోమవారం కేటాయింపు ఉత్తర్వులు (ఆర్డర్స్) జారీచేసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు.
సీనియారిటీ జాబితాలు సరిచేయాలి: పీఆర్టీయూ
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలోని లోపాలను సరిచేయాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరిం ది. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో జీవో- 317పై ఆదివారం జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు విరుద్ధంగా జీవోలోని మార్గదర్శకాలు ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. సీనియర్ ఉపాధ్యాయులను పాత జిల్లాలకు, జూనియర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో భవిష్యత్తులో పదోన్నతులు, ఉద్యోగ నియామకాల్లో సమతుల్యత దెబ్బతింటుందని శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు పేర్కొన్నారు. మార్గదర్శకాల్లో మార్పులు చేసి, సమన్యాయం చేయాలని కోరారు.