హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): ఉద్యోగుల విభజనను ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఉద్యోగుల విభజనపై సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. మరుసటిరోజే ఉద్యోగుల విభజనకు షెడ్యూల్ జారీచేసింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉద్యోగుల సీనియారిటీ జాబితాను తయారు చేసి, దానిని ప్రదర్శిస్తారు. 9న ఉద్యోగుల నుంచి జిల్లాల ఆప్షన్లు స్వీకరిస్తారు. 10న సీనియారిటీ జాబితాను అప్డేట్ చేయడంతోపాటు, ఉద్యోగుల ఆప్షన్లను కమిటీ పరిశీలిస్తుంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపుపై కమిటీ సమావేశాలు నిర్వహించనున్నది.
కమిటీ నిర్ణయాల ప్రకారం ఈ నెల 15న ఉద్యోగులకు ఆయా జిల్లాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేస్తుంది. ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు కొత్త జిల్లాల్లో చేరేందుకు 15వ తేదీ నుంచి వారం పాటు సమయం ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోలేని జిల్లాలకు మాత్రమే షెడ్యూల్ వర్తిస్తుంది. కోడ్ ఉన్న జిల్లాలకు ప్రత్యేకంగా మరోసారి షెడ్యూల్ జారీ చేస్తామని అధికారులు తెలిపారు. పీవో-1975 ప్రకారం రాష్ట్రంలో పది జిల్లాల క్యాడర్లు, రెండు జోనల్ క్యాడర్లున్నాయి. ఇప్పుడు 9 ఉమ్మడి జిల్లాల క్యాడర్ను 32 యూనిట్లకు సర్దుబాటు చేయనున్నారు. ప్రతి జిల్లా క్యాడర్లో 70కి పైగా విభాగాలు, మూడొందలకు మించిన క్యాటగిరీలు ఉంటాయి. పాత రెండు జోన్లలోని ఉద్యోగులను కొత్తగా సృష్టించిన ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లలో సర్దుబాటు చేస్తారు. మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులను శాశ్వతంగా కొత్త క్యాడర్లో సర్దుబాటు చేయనున్నందున ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా పూర్తిచేయనున్నారు.
పర్యవేక్షణకు 9 మంది స్పెషల్ ఆఫీసర్లు: సీఎస్
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపులన్నీ ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, శరవేగంగా పూర్తి చేయడానికి హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలకు 9మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్టు తెలిపారు.
మంగళవారం ఆయన బీఆర్కేభవన్లో డీజీపీ మహేందర్రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణీ కుముదిని, శాంతికుమారి, సునీల్శర్మ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్తోపాటు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్వోడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీనియారిటీతో పాటు మార్గదర్శకాల్లోని అంశాల వారీగా ప్రాధాన్యాలు తీసుకొని, ఉద్యోగుల కేటాయింపు చేయాలని చెప్పారు. ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. మల్టీ జోనల్, జోనల్ పోస్టుల కేటాయింపులకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీలు ఈ నెలాఖరులోగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తి చేయాలని, ప్రతిరోజూ వివరాలను ఆర్థికశాఖకు పంపించాలని ఆదేశించారు.
ఉద్యోగ సంఘాలతో సీఎస్ భేటీ
ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం సచివాలయంలో సీఎస్తో భేటీ అయ్యారు. బదిలీల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాని, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా చూ డాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని విన్నవించారు. సీఎస్ను కలిసిన వారిలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, సత్యనారాయణ, లక్ష్మణ్, ముజీబ్ తదితరులు కూడా ఉన్నారు.
సీఎస్ను కలిసిన ట్రెసా ప్రతినిధి బృందం
జిల్లా, జోనల్, మల్టీ జోనల్ బదిలీలకు ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు బీఆర్కేభవన్లో ట్రెసా ప్రతినిధులు మంగళవారం సీఎస్ను కలిశారు. జీవో 317లో పొందుపరిచిన పలు అంశాలతో పాటు ప్రొఫార్మాలో స్పౌజ్ (జీవిత భాగస్వామి), పీహెచ్సీ, మెడికల్ గ్రౌండ్స్ అనే ఆప్షన్లను పొందుపరచాలని కోరారు. సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాతోపాటు తొలి నియామక జిల్లాను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీ అయిన ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని, పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డీపీసీ ఆమోదం పొంది, తాసిల్దార్ పోస్టింగ్ కోసం లెఫ్ట్ ఓవర్లో ఉన్న డిప్యూటీ తాసిల్దార్లకు పోస్టింగ్లు ఇవ్వాలని, ప్రొబేషనరీ నాయబ్ తాసిల్దార్లకు జిల్లా బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. వీఆర్వోలకు బదిలీ ఆప్షన్ ఇవ్వాలని, వీఆర్ఏలకు స్కేల్ను వర్తింపజేయాలని కోరారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కే నిరంజన్రావు, నాగమణి, కార్యదర్శి మాధవిరెడ్డి తదితరులు సీఎస్ను కలిసినవారిలో ఉన్నారు.
సర్దుబాటు పూర్తికాగానే కొత్త నోటిఫికేషన్లు : మంత్రి
ఉద్యోగుల సర్దుబాటు పూర్తికాగానే ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీచేయనున్నట్టు యువజన సర్వీసులశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. జోనల్ విధానం పూర్తికాగానే శాఖల వారీగా ఖాళీల వివరాలు తెలుస్తాయని, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మంగళవారం నాంపల్లిలోని టీజీవో భవన్లో నిర్వహించిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ కొత్త జోనల్ విధానం ద్వారా సీఎం కేసీఆర్ మంచి అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు.. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయం చేసుకుని, ఉద్యోగుల ఆప్షన్స్ ప్రక్రియలో సహకరించాలని సూచించారు. జోనల్ ఉద్యోగుల విభజన సాఫీగా సాగేలా చూడాలని కోరారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా, చిక్కులు లేకుండా కొత్త జోనల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని టీజీవో అధ్యక్షురాలు వీ మమత పేర్కొన్నారు. దీర్ఘకాలిక సెలవులో, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగుల ఇండ్లకు వెళ్లి ఆప్షన్స్ ఫాంలో సంతకాలు పెట్టించాలని టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సూచించారు.