ముంబై, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఐదు రోజులు నష్టాలకే పరిమితమైన సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, టెలికం, రియల్టీ, పవర్, యుటిలిటీస్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 366.64 పాయింట్లు లేదా 0.64 శాతం పుంజుకుని 57,858.15 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 128.85 పాయింట్లు లేదా 0.75 శాతం అందుకుని 17,277.95 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం మార్కెట్లు నష్టాల్లోనే మొదలయ్యాయి. సెన్సెక్స్ 57వేల దిగువకు పతనమైంది. అయితే మదుపరులు నెమ్మదిగా అమ్మకాల నుంచి కొనుగోళ్ల దిశగా అడుగులు వేయడంతో సూచీలు పెరిగాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు.. ముఖ్యంగా ఐరోపా సూచీల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి.
నేడు మార్కెట్లకు సెలవు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుందని అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈ వర్గాలు ప్రకటించాయి.
ఫెడ్ నిర్ణయం కీలకం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచవచ్చన్న అంచనాల మధ్య రాబోయే ట్రేడింగ్ సెషన్లు కీలకమని, తిరిగి అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను దారిలోకి తెచ్చేందుకు వడ్డీరేట్ల పెంపు జోలికి ఫెడ్ రిజర్వ్సహా చాలా దేశాలు ఇన్నాళ్లూ వెళ్లలేదు. అయితే ఇక పెంచకతప్పదన్న నిర్ణయానికి రిజర్వ్ బ్యాంక్లు వస్తున్నాయి. ఇందుకు ఫెడ్ రిజర్వ్ శ్రీకారం చుడితే మిగతా దేశాల సెంట్రల్ బ్యాంక్లూ అదే బాట పడుతాయని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలు పెద్ద ఎత్తున జరిగి సూచీలు క్షీణించడం ఖాయంగా కనిపిస్తున్నది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలూ మార్కెట్ల పతనానికి ఇతర కారణాలుగా నిలుస్తున్నాయి.
నెల కనిష్ఠానికి రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం నెల రోజుల కనిష్ఠానికి పతనమైంది. 18 పైసలు పడిపోయి రూపాయి విలువ 74.78 వద్దకు దిగజారింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో రూపాయి నష్టాలపాలైనట్టు ఫారెక్స్ ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో డాలర్కు ఆదరణ పెరగడం, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించడం కూడా రూపాయిని క్షీణతకు గురిచేసిందని వారు విశ్లేషిస్తున్నారు. స్టాక్ ఎక్సేంజ్ వివరాల ప్రకారం సోమవారం విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.3,751.58 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.