తెలుగు చిత్ర పరిశ్రమ మరో ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోయింది. అగ్ర హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన సీనియర్ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 74 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. కుటుంబ కథా నేపథ్యంతో బలమైన హీరోయిజం ఉన్న చిత్రాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. 1986లో ‘చాదస్తపు మొగుడు’ అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు శరత్. ఈ చిత్రంలో సుమన్, భానుప్రియ జంటగా నటించారు. ఆ తర్వాత ‘పెద్దింటల్లుడు’ సినిమా కమర్షియల్ సక్సెస్ను అందించింది. ఈ సినిమా విజయంతో వెనుదిరిగి చూడని శరత్ దాదాపు 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమన్తో అత్యధికంగా 8 చిత్రాలను రూపొందించారు. వీటిలో ‘బావ బావమరిది’, ‘చిన్నల్లుడు’ వంటి చిత్రాలుండగా..బాలకృష్ణతో ‘వంశోద్ధారకుడు’, ‘పెద్దన్నయ్య’, ‘వంశానికొక్కడు’, ‘సుల్తాన్’..ఇలా నాలుగు చిత్రాలను తెరకెక్కించారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘కాలేజీ బుల్లోడు’, ‘పండగ’ చిత్రాలను రూపొందించారు. శరత్ మృతి పట్ల చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. హీరో బాలకృష్ణ స్పందిస్తూ..‘నాకు ఆప్తుడైన దర్శకుడు శరత్ మరణ వార్త కలచివేసింది. ప్రతిభావంతుడైన దర్శకుడే కాక మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో శరత్ అంత్యక్రియలు జరగనున్నాయి.