సికింద్రాబాద్, డిసెంబర్ 7: రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్ల్లో త్వరలో కీలక మార్పులు చోటు చేసుకోనే అవకాశం కనిపిస్తుంది. మిలటరీ ఆధిపత్యంలో పరిపాలన సాగే కంటోన్మెంట్లలో మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధులకు తగిన అధికారాలు కల్పించే వెసులుబాటు రాబోతుంది. 1924లో రూపొందించిన తొలి కంటోన్మెంట్ చట్టంలో కొద్దిపాటి మార్పులతో 2006లో ది కంటోన్మెంట్స్ యాక్ట్-2006 రూపొందించ డం జరిగింది. గత చట్టంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, బోర్డు స్వరూపాన్నే మార్చే తరహాలో కీలక సవరణలు చేపట్టారు.
ఇంతకాలం కంటోన్మెంట్ బోర్డుల్లో నామ మాత్రంగానే కొనసాగిన ప్రజాప్రతినిధులైన బోర్డు సభ్యులు ఇకపై కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ముసాయిదా బిల్లు లో ఏఏ అంశాలు పొందుపర్చారనే విషయాలు ఇప్పటి వరకు వెల్లడించకపోయినప్పటికీ త్వరలోనే జరగనున్న బోర్డు ఎన్నికలు పార్టీ గుర్తులపై బోర్డు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు ఉపాధ్యక్షుడిని సైతం ప్రత్యక్ష తరహాలో నేరుగా ప్రజలే ఎన్నుకోనున్నారు. కంటోన్మెంట్స్ బిల్-2021 ముసాయిదాల్లో కొన్ని మార్పులతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత కంటోన్మెంట్ల పాలన నూతన చట్టం ఆధారంగానే కొనసాగనుంది.
ఎన్నికల కమిషన్తో సంబంధం లేకుండా కంటోన్మెంట్లో ఓటరు జాబితా ప్రత్యేకంగా రూపొందించడం జరుగుతుంది. ఇక త్వరలో జరగాల్సిన బోర్డు ఎన్నికల కోసం ఈ పాటికే ప్రకటించిన వార్డుల రిజర్వేషన్లు సైతం మారే అవకాశం కనిపిస్తుంది.
కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యే వారికి బోర్డులో చెప్పుకోదగ్గ అధికారాలేమీ ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. కేవలం బోర్డు సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించడం మినహ, బోర్డు సభ్యులకు అధికారికంగా ప్రత్యేక కార్యాలయం కూడా లేదు. దీంతో ఉపాధ్యక్షుడికి సైతం బోర్డు సభ్యులతో పోలిస్తే ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. ఈ క్రమంలో నూతన చట్టం ప్రకారం పాలనా సౌలభ్యం కోసం ఆర్థిక, విద్య, వైద్యం, సివిల్ ఏరియా వంటి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కమిటీల్లోనూ ఉపాధ్యక్షుడు కీలకం కానున్నారు.
ప్రస్తుతం కేటగిరి-1 కంటోన్మెంట్గా కొనసాగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉంది. నూతన చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ పార్టీల గుర్తులపై ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించే దిశగా చట్టంలో రూపకల్పన చేశారు. ఎనిమిది వార్డుల నుంచి ఒక్కో సభ్యుడితో పాటు, అన్ని వార్డుల ప్రజలు ఉపాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకునే అవకాశం కల్పించారు.