సెబీ ప్రతిపాదన
న్యూఢిల్లీ, మార్చి 26: కంపెనీలు ప్రకటించే ఓపెన్, బైబ్యాక్ ఆఫర్లను పూర్తిచేసేందుకు నిర్దేశించిన కాలపరిమితుల్ని తగ్గించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది. ఇన్వెస్టర్లకు స్నేహపూరితంగా, ప్రక్రియను మరింత సమర్థవంతం చేసేందుకు ఈ ఆఫర్లలో మార్పులతో కూడిన ఒక చర్చాపత్రాన్ని సెబీ తాజాగా విడుదల చేసేంది. ఒక కంపెనీ యాజమాన్యాన్ని టేకోవర్ చేసిన కంపెనీ..పబ్లిక్ ఇన్వెస్టర్లకు ప్రకటించే ఓపెన్ ఆఫర్ గడువును 62 పనిదినాల నుంచి 42 పనిదినాలకు కుదించాలని ఆ పత్రంలో పేర్కొంది. కంపెనీ తన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రకటించే బైబ్యాక్ ఆఫర్ అమలులో ఉండే సమయాన్ని 43 పనిదినాల నుంచి 36 పనిదినాలకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై ఏప్రిల్ 15లోగా సూచనలు, వ్యాఖ్యల్ని తెలియచేయాలని ప్రజల్ని కోరింది.
పీఎస్యూల ఓపెన్ ఆఫర్ నిబంధనలు సరళతరం
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూలు) డిజిన్వెస్ట్మెంట్ సందర్భంగా జారీచేసే ఓపెన్ ఆఫర్ ధరను నిర్ణయించే ప్రక్రియలో మార్పులను సెబీ ప్రతిపాదించింది. ఓపెన్ ఆఫర్ ధరను..మార్కెట్లో ఆ కంపెనీ షేరు 60 రోజుల ట్రేడింగ్ పరిమాణం వెయిటేజీతో కూడిన సగటు ధర ఆధారంగా నిర్ణయించాలన్న నిబంధనను రద్దుచేయడంతో పాటు మరికొన్ని నిబంధనల్ని సరళతరం చేస్తూ ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. పీఎస్యూల విక్రయాలకు సంబంధించిన సమాచారం క్యాబినెట్ అనుమతి తర్వాతే బహిర్గతమవుతుందని, తదుపరి ప్రకటనలు సైతం వివిధ దశలలో వెలువడతాయని మార్కెట్ రెగ్యులేటర్ వివరించింది. ఈ పక్రియ అంతా పూర్తికావడానికి నెలలు, సంవత్సరాలు పడుతుందని, ఈ కారణంగా 60 రోజుల మార్కెట్ ధర ఆధారిత ఓపెన్ ఆఫర్ నిబంధనను పీఎస్యూ డిజిన్వెస్ట్మెంట్లకు తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తెలిపింది.