హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నా అక్కడక్కడా నీళ్లు నిలిచి దోమలు, ఇతర క్రిమికీటకాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ రోగ నివారణ చర్యలు చేపడుతున్నది. అయితే ప్రజలు సొంత వైద్యం చేసుకొంటూ ఇబ్బందులు పడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ జ్వరమైనా పారాసిటమాల్ వేసుకోవచ్చని, దీంతో ఎలాంటి ముప్పు లేదన్నారు.
అయితే రెండుమూడు రోజులు విడువని జ్వరం ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు వేర్వేరు రోగ లక్షణాలు ఉంటాయి. కొందరు యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతుండటంతో అవి వ్యాధి లక్షణాలను అణచివేస్తున్నాయి. దీంతో బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా.. లోపల వ్యాధి ముదురుతున్నది. ముఖ్యంగా డెంగ్యూ బాధితులు సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు.
డెంగ్యూ సోకినప్పుడు విడువకుండా జ్వరం, దురదలు, దద్దుర్లు, కంటి వెనుక, నడుము కింది భాగంలో నొప్పి, జలుబు, దగ్గు, గొంతునొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మూడో రోజు తర్వాత బయటపడుతుంటాయి. కొందరు డాక్టర్ను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడంతో రోగ లక్షణాలు బయటికి కనిపించడం లేదు. కానీ వారి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతున్నదని డాక్టర్లు చెప్తున్నారు. వారు ఊపిరితిత్తుల్లోకి, కాలేయంలోకి ఇన్ఫెక్షన్ చేరిన తర్వాత దవాఖానకు వెళ్తున్నారు. కేవలం ఫ్లూయిడ్స్తో 2-3 రోజుల్లో కోలుకోవాల్సిన వారు.. వారాలపాటు చికిత్స పొందాల్సి వస్తున్నదని డాక్టర్లు చెప్తున్నారు.
ఈ సీజన్లో డెంగ్యూ కేసులు పెరిగినా.. 2019తో పోల్చితే వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉన్నది. చాలామందికి ఫ్లూయిడ్స్తోనే నయం అవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఇంకొందరికయితే మామూలు జ్వరం మాదిరిగా వచ్చిపోతున్నదన్నారు. దీంతో డెంగ్యూ సోకింది.. పోయింది కూడా వారికి తెలియడం లేదు. ఒంటినొప్పులు, నీరసం, తలనొప్పి వంటి ‘పోస్ట్ డెంగ్యూ’ లక్షణాలు కనిపించి, పరీక్షలు చేయించుకున్నప్పుడే అసలు విషయం బయటపడుతున్నది. సీజనల్ ఫీవర్ సోకినవారు కచ్చితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. పీహెచ్సీ మొదలు అన్ని స్థాయిల దవాఖానల్లో టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతున్నారు. ఒక్క రోజులోనే ఫలితం చేతికి అందుతున్నది. కాబట్టి ఈ సేవలను వినియోగించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సీజనల్ ఫీవర్ రాగానే చాలామంది సొంత వైద్యం మొదలు పెడుతున్నారు. అందరికీ ఒకే రకమైన వ్యాధి వస్తుందనే భ్రమ అస్సలు పెట్టుకోవద్దు. కొందరు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడు రోజుల తర్వాత బయటపడాల్సిన లక్షణాలు 8-9 రోజులకు కూడా కనిపించడం లేదు. అప్పటికే కాలేయం, ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్ చేరుతున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్లేట్లెట్లు 10వేల వరకు పడిపోయినా.. నార్మల్ ట్రీట్మెంట్తో కోలుకుంటారు. పెద్దగా ఇబ్బంది పడరు. కానీ.. పెయిన్ కిల్లర్లు, ఆకు రసాలు తాగి ప్రాణాలమీదికి తెచ్చుకున్నవారికి ప్లేట్లెట్స్ కౌంట్ 20-30 వేలు ఉన్నా ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి ట్యాబ్లెట్ల శాస్త్రీయత ఇంకా రుజువు కాలేదు. వీటిపై ఆధారపడి వైద్యం నిర్లక్ష్యం చేయవద్దు. జ్వరం వచ్చిన తర్వాత మూడో రోజు నుంచి వాంతులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ బీబీ రావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్