సాంకేతికత-ఆధునికత కలిసి క్రోనీ క్యాపిటలిజంతో జత కట్టినప్పుడు అవి స్వాభావికంగా విభేదించే అంశాలకు కూడా వాటి మనుగడ కోసం వేదికలుగా మారుతాయి. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులే అందుకు ఒక ఉదాహరణ. సోషల్ మీడియా వేదికగా హిందుత్వ మతోన్మాద శక్తులు.. ఉద్దేశపూర్వక తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తలు, నిర్దిష్ట సమూహాల చుట్టూ అల్లే కుట్ర సిద్ధాంతాలు, సూడో చరిత్రలను వ్యాప్తి చేస్తూ రాజకీయ లక్ష్యాలను సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్న ఆ సంస్థలు చేష్టలుడిగి ఒక బలమైన రాజకీయ పార్టీకి అనుకూల వైఖరిని అవలంబిస్తుండటం ఆందోళనకరం.
Social Media | ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్ తదితర సంస్థల యూజర్లలో అత్యధికులు భారతీయులే. భారతీయ యూజర్ల కారణంగా ఆ కంపెనీలు లక్షల కోట్లు గడిస్తున్నాయి. అందుకే మన దేశంలో నిష్పక్షపాతం కోసం ఆ కంపెనీలు తమ వ్యాపారాలను పణంగా పెట్టే సాహసం చేయడం లేదు. కొన్ని కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నా వాటికి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా సంస్థల మార్కెట్ విదిత నిస్సహాయతను మతోన్మాద జాతీయవాద శక్తులు తమ అనుకూల ప్రజాభిప్రాయ నిర్మాణానికి, ప్రత్యర్థుల వ్యతిరేక కథనాల వ్యాప్తికి విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి.
ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే నిర్ణేతలు అనేది సాంప్రదాయ పార్లమెంటరీ సూత్రీకరణ. కానీ, ఆ మెజారిటీ ఓటర్ల ప్రవర్తనను ప్రభావితం చేసే సైకలాజికల్ యంత్రాంగంగా సోషల్ మీడియా మారిపోయింది. అందుకే రాజకీయ పార్టీలు దానిమీద అంతగా ఆధారపడుతున్నాయి. ఆయా వేదికలను వాడుకోవడంలో ఆరితేరిన పార్టీలకు, వాటికి దన్నుగా పనిచేసే మతతత్వ సంస్థలకు, వారి అనుయాయులకు.. ఈ ఎన్నికల్లో ఓటేయనున్న వారిలో అత్యధికులు 18-40 ఏండ్లలోపు ఉన్న మిలీనియల్స్- జెన్-జీలే అధికమని, వారి దైనందిన వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాతోనే ముడిపడి ఉన్నదని బాగా తెలుసు. అందుకే ఎప్పుడో మొదలుపెట్టిన మాయల ప్రచారాన్ని ఇప్పటికీ దూకుడుగా కొనసాగిస్తున్నారు. వీ-డెమ్ లాంటి ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలు 2023 నాటికే మన దేశాన్ని ఎన్నికల ద్వారా ఏర్పాటైన నియంతృత్వంగా గుర్తించాయి.
‘సామాజిక భ్రమల్లోకి నెట్టివేసిన సమాజంలో ప్రజలు వాళ్లకు రుచించని ఆధారాలను తిరస్కరిస్తారు. ఆకర్షణీయంగా ఉన్న తప్పులనే నమ్మి కీర్తిస్తారు. అలాంటి భ్రమలను సృష్టించేవారు వారికి యజమానులుగా మారుతారు. కానీ, ఆ భ్రమల్ని తొలగించే వాళ్లు శత్రువులుగా మిగిలిపోతారు’ అని ఫ్రెంచి సోషల్ సైకాలజిస్ట్ గుస్తవే లేబాన్ చేసిన హెచ్చరికను ఈ పరిస్థితి గుర్తుచేస్తున్నది.
దేశ ఆర్థిక పరిస్థితి, విద్య, నిరుద్యోగం, ఆకలి, శాంతిభద్రతలు, ఆరోగ్యం, చరిత్ర, సైన్సు.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా దేశంలో వాస్తవిక పరిస్థితి ఒకలాగా ఉంటే సోషల్ మీడియా వేదికగా కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన సూడో చరిత్రకారులు మాత్రం అందుకు భిన్నంగా అభూత కల్పనలను సృష్టిస్తున్నారు. ప్రామాణిక గణాంకాలకు, చారిత్రక పరిశోధనలకు సైతం అంతుచిక్కని విధంగా కథనాలు వండి వారుస్తూ సాధారణ ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారు. వాళ్లు సృష్టిస్తున్న వదంతులు, దుష్ప్రచారాలన్నీ చాలామంది జేబుల్లోంచి (ఫోన్) మెదళ్లలోకి ప్రవేశించినవే. ఇలాంటి సూక్ష్మ, స్థూల అంశాలను పరిశీలించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచాన్ని కలవరపెడుతున్న తప్పుడు సమాచారం విపత్తును తక్షణం ఎదుర్కొనే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉందని హెచ్చరించింది.
స్క్రీన్ వెనకాల మారుపేర్లతో, మారుఫొటోలతో లేదా ఒక వ్యక్తిగా, ఒక మీడియా సంస్థగా, ఫేస్బుక్ పేజీలుగా, వాట్సాప్ గ్రూపులుగా నడిచే ఈ ఆన్లైన్ గుంపులు, ప్రభావకులు కేవలం వారు పనిచేస్తున్న పార్టీ రాజకీయ ప్రత్యర్థుల మీద, పార్టీల మీద వ్యతిరేక ప్రచారాలతో ఆగిపోలేదు. బలహీనమైన, సాంస్కృతికంగా భిన్నమైన మైనారిటీలను, దళితులు, ఆదివాసీలను ఎంచుకుని వారి సంస్కృతిని, అస్తిత్వాన్ని, మనుగడనూ ప్రశ్నిస్తున్నారు. వ్యతిరేక రాజకీయ అభిప్రాయాలున్న వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
చరిత్ర వాఖ్యానానికి సంబంధించిన ఏ విద్యార్హత లేని ఒక ప్రభావకుడు ‘అసలు కులానికి, హిందూమతానికి సంబంధమే లేదు, అది బ్రిటిష్వాళ్ల సృష్టి’ అని అంటాడు. ఇంకొకాయన ‘అసలు అంబేద్కర్కు చదువే రాదు, రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర ఏమీ లేదు’ అని అంటాడు. దళితులకు, ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల వల్లనే దేశం వెనుకబడిందని ఇంకొక ఐటీ సెల్ భటుడు తీర్పు ఇస్తాడు. మైనారిటీలను నేరగాళ్లుగా, వారు ఉండే ప్రాంతాల్లో వేరే వాళ్లకు రక్షణే లేదని, అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అసలు పని చేయదని ఇంకొందరు కథలు వ్యాప్తి చేస్తారు. ఇంకాస్త తలపండిన ప్రభావకులైతే మేధోమథనాల పేరు మీద చర్చలు పెట్టి, దళితులు, మైనారిటీల మీద, రాజ్యాంగం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. చరిత్ర అంతా తప్పు అని తీర్మానించేస్తారు.
గత వైభవాన్ని మళ్లీ తీసుకొస్తానని యువకులు, మధ్య తరగతి వారిని రెచ్చగొట్టి 90 ఏండ్ల కిందట జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జోసెఫ్ గోబెల్స్ను సాంస్కృతిక-ప్రాపగండా శాఖమంత్రిగా నియమించారు. చరిత్ర, సైన్స్, అర్థ శాస్త్రం, రేడియో, సినిమా, సాహిత్యం, పత్రికలు, పిల్లల ఆటలు-పాటలు, బొమ్మలు.. ఇలా ఏ రంగాన్ని కూడా వదలకుండా అన్నింటిని ఆయన యూదు వ్యతిరేక అంశాలతో నింపేశారు. ఫలితంగా ఇటువంటి సోషల్ మీడియా లేని ఆ కాలంలో జరిగిన యూదుల ఊచకోత ఒక నెత్తుటి చరిత్రకు సాక్ష్యంగా మిగిలిపోయింది.
ఈ ఎన్నికలకు నెలరోజుల ముందు యూట్యూబ్ వంటి వేదికల మీద ప్రభావకులుగా చెలామణిలో ఉన్న సుమారు 24 మందికి కంటెంట్ క్రియేటర్స్ పేరిట ప్రధాని మోదీ అవార్డులను అందజేసింది. ఆ పురస్కారాలను అందుకున్నవారిలో సగానికి పైగా బీజేపీ ఎదుగుదలకు తోడ్పడ్డవాళ్లు లేదా ఆ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసినవాళ్లే. వారికి ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం అట్లాంటి విషయాల హేతుబద్ధతను, శాస్త్రీయతను పక్కకుపెట్టి నమ్మిన విషయం ప్రమాదకరమని తెలిసినా, ఎలాగైనా ప్రచారం చేసే వాళ్లకొక ఉత్ప్రేరకం లాంటిది. నేడు సోషల్ మీడియా ప్రభావకులుగా చెలామణి అవుతున్న వేలాదిమంది ఆన్లైన్ పోకిరిల చేతుల్లో బహుశా కొన్ని కోట్ల మంది ఓటర్ల మెదళ్లు ఉన్నాయి. వాళ్లు ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని మాత్రమే కాదు, తదనంతరం జరిగే పరిణామాల్లో వారి పాత్రను ప్రభావితం చేయబోతున్నారనేది ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, అదే నిజం.
– పెద్దబూరి చరణ్ తేజ