ఈ మధ్యకాలంలో మిరపకు కొత్తగా సోకిన తామర పురుగు రైతులను కలవరపెడుతోంది. సాధారణంగా పురుగులు ఆకుల్లోని రసం పీల్చుతాయి.. కానీ ఈ కొత్త రకం పురుగు మాత్రం పువ్వుల్లోని పుప్పొడిని సైతం పీల్చి పూత, కాత లేకుండా చేసి ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడాఇక్కడా అని కాదు.. రాష్ట్రమంతా ఇదే సమస్య తలెత్తడంతో శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఈమేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండలో ఐఐహెచ్ఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్) బెంగళూరు, హైదరాబాద్ శాస్త్రవేత్తలు వచ్చి తెగులును పరిశీలించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలపై ప్రస్తుతానికైతే అందరూ ఒకేసారి ఫిప్రోనిల్ మందు పిచికారీ చేయాలని సూచించారు. సేకరించిన శాంపిళ్లను ల్యాబ్లో పరిశీలించిన తర్వాత నివారణ మార్గాలు చెబుతామని భరోసా ఇచ్చారు.
గూడూరు/మల్హర్, నవంబర్ 30 : మిరపకు సోకుతున్న తామర తెగులు పురుగుతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తాము సూచించిన మందులను పిచికారీ చేసుకోవాలని ఐఐహెచ్ఆర్ బెంగళూరు సీనియర్ ఎంటమాలజిస్టు డాక్టర్ శ్రీధర్ సూచించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ గ్రామంలో పంటలకు ఆశించిన తామర తెగులును బెంగళూరు, హైదరాబాద్ శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. బొద్దుగొండలో 80 ఎకరాలు, కొల్లాపురంలో 70 ఎకరాల్లో తెగులు వ్యాపించిందని, 15 రోజుల నుంచి ఈ కొత్త పురుగు పువ్వుల్లోని పుప్పొడిని సైతం పీల్చి పూత, కాత లేకుండా చేస్తున్నదని రైతులు స్థానిక హార్టికల్చర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వారు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కార్యాలయాలకు సమాచారం ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చారు.
సీనియర్ ఎంటమాలజిస్టు డాక్టర్ శ్రీధర్, ఎన్బీఏఐఐ నుంచి శాస్త్రవేత్త రచన, హార్టికల్చర్ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ బొద్దుగొండలోని రైతు నంజాల రామారావు మిరప తోటకు చేరుకొని పూతను పరిశీలించారు. ఈ పూత(పువ్వు)ను సేకరించి ల్యాబ్లో పరిశోధనల కోసం తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత నివారణ మార్గాలు తెలియజేస్తామని, ఇలాంటి తెగులును కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలో గమనించామని, వీటి గురించి కూడా సమగ్రంగా పరిశోధనలు చేసి వివరాలు చెబుతామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారి వెంట కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు రాములమ్మ, జిల్లా హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్, ఏడీఏ లక్ష్మీనారాయణ, ఏవో రాకేశ్, హెచ్వో అరుణ్, ఏఈవో రెడ్యా, ఎఫ్వో అశోక్, రైతులు జిల్లా యాకయ్య, బస్నబోయిన వెంకన్న, జాటోత్ కస్నా, నంజాల వెంకటేశ్వర్లు, కొర్లకుంట వెంకటనారాయణ, ఆళ్ల రామారావు ఉన్నారు.
ఆందోళన పడొద్దు -ఏవో మహేశ్, మల్హర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని పెద్దతూండ్ల, చిన్నతూండ్ల గ్రామాల్లో తామర పురుగు ఆశించిన పంటలను మంగళవారం వ్యవసాయాధికా రులు పరిశీలించారు. మండలంలో ప్రధానంగా పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, తాడిచెర్ల, నాచారం, అన్సాన్పల్లి గ్రామాల్లో 1400 ఎకరాల్లో మిరప సాగవుతుండగా, హఠాత్తుగా తెగులు సోకడంతో ఆయా గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇండోనేషియా నుంచి మన దేశంలోకి ఈ పురుగులు వచ్చాయని వారు చెప్పారు. ఇవి పువ్వులోకి చేరి గుంపులు గుంపులుగా ఉండి అందులోని రసాన్ని పీల్చేసి, పువ్వును పూర్తిగా ఎండిపోయేలా చేస్తాయని పేర్కొన్నారు. రైతులెవరూ ఆందోళనపడొద్దని, నివారణ చర్యలు పాటించాలని ఏవో ముంజ మహేశ్ చెప్పారు.
నివారణ ఇలా..
కొత్తగా వచ్చిన ఈ తామర తెగులును నివారించేందుకు రైతులు అంతా ఒకేసారి పురుగుమందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. పసుపు రంగు, నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, చెట్టుపై కాకుండా నేలపై ఫిప్రోనిల్ గుళికలు వాడాలని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతానికి స్పైనోస్పాడ్ లేదా ఎసిటామిప్రైడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ వంటి మందులు లీటరుకు 3 గ్రాముల వేప కషాయాన్ని కలిపి వాడాలని.. వాటిని మార్చి మార్చి పిచికారీ చేయాలని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ఈ పురుగు ఆశించిందని, రైతులు తమ పంటలను అనుకూల వాతావరణం వచ్చే వరకు పైసూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలన్నారు.
పూత, కాత లేకుండా చేసింది..
ఏం చేసినా మిరప చేను నుంచి పురుగు పోతలే దు. 15 రోజుల నుంచి అందరు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇదివరకు ఆకు రసం పీల్చే పురుగును చూశాం. మందులు కొడితే చనిపోయేది. కానీ ఈ కొత్త రకం పురుగు పు ప్పొడిని తింటూ కాయలు కాయనివ్వడం లే దు. ఎన్ని మందులు కొట్టినా పెరుగుడే తప్ప తగ్గుత లేదు. ఏం చేయాలో తెలువక ఆఖరు కు అధికారులకు దగ్గరికి పోయినం. శాస్త్రవేత్త లు వచ్చి చూసిన్రు. కొన్ని సలహాలు చెప్పిన్రు.
నాలుగు రాష్ర్టాల్లో లక్షణాలు..
కేవలం తెలంగాణ లోనే కాదు.. దేశంలో ని కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా ఈ తెగులు లక్ష ణాలు కన్పించాయి. కొన్ని ప్రాంతాల నుంచి వాటిని సేకరిం చాం. ల్యాబ్లో పరీక్షించిన తర్వాత నివా రణ ఉపాయాలు సూచిస్తాం. ప్రస్తుతానికి కొన్ని నివారణ మార్గాలను రైతులకు చెప్పి స్థానిక హార్టికల్చర్ అధికారులతో అవగా హన కల్పిస్తాం. రైతులు ఒక్కొక్కరు కాకుం డా అందరూ మేం చెప్పినట్లు పిచికారీ మందులు వాడాలి.