హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ర్టానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్… మరో విదేశీ సంస్థను టేకోవర్ చేసింది. మొన్నటికి మొన్న యూరప్కు చెందిన టెక్నాలజీ కంపెనీ సిటిక్ను రూ.700 కోట్లకు కొనుగోలు చేసిన సైయెంట్..తాజాగా సింగపూర్కు చెందిన గ్రిట్ కన్సల్టింగ్ను రూ.284 కోట్లకు హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు ఒప్పందం జరగనున్నది.
అసెట్-ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో అనుభవం కలిగివున్న గ్రిటి కన్సల్టింగ్ను కొనుగోలు చేయడంతో మెటల్ మైనింగ్, ఎనర్జీ రంగాల్లో సైయెంట్కు ఉన్న కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి దోహదం చేయనున్నదని సైయెంట్ ఎండీ, సీఈవో కృష్ణ బొడనపు తెలిపారు. గ్రిటి కన్సల్టింగ్ ఎంటర్ప్రైజెస్ విలువ 37 మిలియన్ డాలర్లు.. 2021- 22లో కంపెనీకి వచ్చిన ఆదాయం కంటే 2.04 రెట్లు అధికం. ఈ ఒప్పందం మే 5 నాటికి పూర్తికాగలదని సైయెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2025 నాటికి అంతర్జాతీయంగా కన్సల్టింగ్ సేవల మార్కెట్ 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని అంచనా.