సనత్నగర్ జోన్ బృందం : సుదీర్ఘకాలం తరువాత కొవిడ్ నుండి కోలుకుంటున్న పరిస్థితుల్లో బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్ధులు ఉత్సాహంగా బడిబాట పట్టినా హాజరు శాతం తక్కువగా నమోదైంది. విద్యార్ధులు వందశాతం మాస్కులు ధరించి హాజరయ్యారు. పాఠశాలల గేట్ల వద్దనే విద్యార్ధులకు శానిటైజింగ్తో పాటు థర్మల్ స్క్రీనింగ్లు చేస్తూ పాఠశాలల యాజమాన్యాలు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.
అయితే తొలి రోజు కావడంతో విద్యార్ధుల సంఖ్య పల్చగా నమోదైందని ఒకటి రెండు రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలు తెరుచుకునే విషయమై మంగళవారం నాడు కోర్టు మధ్యంతర స్టే విధించిందనే అంశంపై విద్యార్ధుల్లో నెలకొన్న అయోమయం కూడా హాజరు శాతం తగ్గేందుకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో విడిచి పెట్టేందుకు వచ్చి.. లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై వాకబు చేస్తుండడం కనిపించింది.
ఎటువంటి భయాందోళనలు లేకుండా చదువులపై దృష్టి సారించాలంటూ డిప్యూటీ ఈవో సురేష్కుమార్ విద్యార్ధులకు ధైర్యం చెప్పారు. తొలిరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజనాలు తీసుకున్న వారి సంఖ్య సంతృప్తికరంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తున్నట్టు సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు. తొలి రోజున నియోజకవర్గం పరిధిలో బేగంపేట్ ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా 26 శాతం, బోయిగూడలో అత్యల్పంగా 10శాతం విద్యార్ధులు హాజరయ్యారు.
సం. పాఠశాల విద్యార్ధుల సంఖ్య హాజరు సంఖ్య హాజరుశాతం
1-అమీర్పేట్ ప్రభుత్వ పాఠశాల 458 105 25
2- అశోక్కాలనీ ప్రభుత్వ పాఠశాల 240 61 25
3-రౌండ్ టేబుల్ పాఠశాల సనత్నగర్ 320 60 18
4- నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాల 250 61 25
5- బేగంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 245 71 26
6-బోయిగూడ ప్రభుత్వ పాఠశాల 300 30 10
—————————————————————–