న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు, ముస్లింలు వాదిస్తున్నారు. అయితే ఆ మసీదులో వీడియో సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీం కోర్టు ఆ సర్వేను అడ్డుకునేందుకు నిరాకరించింది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ ఈ కేసును పరిశీలించింది. ఎన్నో ఏళ్ల నుంచి జ్ఞానవాపి మసీదులో ప్రార్థనలు జరుగుతున్నట్లు న్యాయవాది హుజేఫా అహ్మది తెలిపారు. మసీదులో సర్వే కోసం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని సీజేను ఆయన కోరారు. ఈ నేపథ్యంలో సీజే రమణ స్పందిస్తూ.. తనకు ఆ వివాదం గురించి ఏమీ తెలియదని, ఎలా తాను ఆదేశాలు ఇవ్వగలనని, ముందు చదువుతాను, ఆ కాపీలు ఇవ్వండి అంటూ సీజే తెలిపారు. వారణాసి స్థానిక కోర్టు ఆదేశాల ప్రకారం.. అడ్వకేట్ కమిషన్ ఆ మసీదులో వీడియో సర్వే చేపడుతున్నారు. మే 17వ తేదీ లోగా ఆ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదులో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నట్లు భావిస్తున్నారు.