హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నదని, వాటిని కాపాడటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాడాలని పీఎస్యూల కార్మిక సంఘాలు ఒక్కుమ్మడిగా విజ్ఞప్తిచేశాయి. తాము చేస్తున్న పోరాటానికి సారథిలా ముందుండి నడిపించాలని కోరాయి. మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం నిర్వహించిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో సమావేశమైన వివిధ సంఘాలు ఈ మేరకు విజ్ఞప్తిచేశాయి. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి మోదీది మేక్ ఇన్ ఇండియా పాలసీ కాదని, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటంచేస్తామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణప్రకటిస్తామన్నారు.
మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం నిర్వహించిన ట్రేడ్ యూనియన్ల సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడుతూ ‘సేవ్ పీఎస్యూ.. సేవ్ ఇండియా’ అనే నినాదంతో త్వరలోనే ప్రజల్లోకి వెళ్తామని, కేంద్రంపై అలుపెరగని పోరాటంచేస్తామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని కుట్రపూరితంగా ప్రైవేట్పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదన్నారు. కేంద్ర సంస్థలను ప్రైవేట్పరం చేయడమంటేనే రిజర్వేషన్లను తీసివేయడమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేసేందుకు మోదీ ప్రభుత్వం చాపకింద నీరులా పావులు కదుపుతున్నదని ధ్వజమెత్తారు. కొత్తవి పెట్టరు కానీ ఉన్నవి తెగనమ్ముతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడేండ్లలో 37 పీఎస్యూలను బీజేపీ సర్కారు తెగనమ్మిందని వెల్లడించారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, హెచ్ఎంటీ, ప్రాగాటూల్స్, మిధాని, డీఆర్డీఎల్, ఈసీఐఎల్, మింట్, పోస్టల్, డీఎల్ఆర్ఎల్, ట్రేడ్యూనియన్ నేతలు రూప్సింగ్, రాజారాంయాదవ్, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ సంఘాల నాయకులు సత్విందర్సింగ్, దాన కర్ణాచారి, యాదవరెడ్డి, విఠోబా, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, భాస్కర్రెడ్డి, రవికుమార్, రమేశ్, రాధేశ్యామ్, నాగమోహన్, సుందర్, సత్యనారాయణ, సురేందర్, శ్రీనివాస్గౌడ్, చెన్నయ్య, యాకయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మన సంపదను కాపాడుకోవాలె
స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో హైదరాబాద్లో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే నాటి కేంద్రపాలకులు ప్రభుత్వరంగ సంస్థలను ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకువచ్చారని వినోద్కుమార్ వివరించారు. అనేక సంస్థలకు భూములను లీజుకు ఇచ్చారని, కొన్నింటికి పూర్తిగా హక్కులను కల్పించారని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్క హైదరాబాద్లోనే దాదాపు లక్షా యాభైవేల మంది పనిచేస్తున్నారని తెలిపారు. రక్షణశాఖ సంస్థలను సైతం ప్రైవేట్వ్యక్తులకు అమ్మేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నదని తెలిపారు. మిధాని, బీడీఎల్, ఆర్డినెన్స్ సంస్థలను కూడా అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం బీజేపీ సర్కారు ఆయా సంస్థలను ప్రైవేట్కు అప్పగించడంతోపాటు, భూములను కూడా తెగనమ్మాలని చూస్తున్నదని, ఇప్పటికే పలు సంస్థలకు చెందిన భూములను ధారాదత్తం చేసిందని ధ్వజమెత్తారు. ట్రేడ్ యూనియన్లు జేఏసీగా ఏర్పడి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాచేసే ఉద్యమానికి తెలంగాణ దిక్సూచిగా నిలువాలని వినోద్కుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ వల్లే భెల్కు పనులు..
దేశీయ పరిశ్రమల మకుటంలోని మహారత్న సంస్థ బీహెచ్ఈఎల్. ఇప్పుడు దీనిపై కార్పొరేట్ల పడగ నీడపడింది. తన తాబేదారులకు దీనిని ధార పోసేందుకు ఎన్డీయే సర్కారు కుయుక్తులు పన్నుతున్నది. అంగడి సరుకుగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.40 వేల కోట్ల ఆర్డర్ను తెలంగాణ సర్కారు ఇవ్వకపోయి ఉంటే సంస్థ ఇప్పటికే మూతపడేది. కార్మికులు సంఘటిత పోరాటాలకు దిగాలి. అందుకు కేసీఆరే నాయకత్వం వహించాలి.
పరోక్షంగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
ప్రభుత్వ రంగసంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా పరోక్షంగా కేంద్రం రిజర్వేషన్లను లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నది. ప్రైవేటీకరణ ఫలితంగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే తీవ్రంగా నష్టపోనున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. ట్రేడ్ యూనియన్లు ఏకతాటిపైకి రావాలి. ఒకే వేదికను ఏర్పాటు చేసుకొని కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలపై పోరాడాలి.
మా గొంతుకను వినిపించండి..
దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో దిగ్గజ సంస్థ ఈసీఐఎల్. దీనిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడం దేశభద్రతకు ముప్పు. దేశప్రగతిలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నవి పీఎస్యూలే. వాటిని నిర్వీర్యం చేయకుండా బీజేపీ సర్కారును నిలువరించాలి. అందుకు సీఎం కేసీఆర్ చొరవ చూపాలి. ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగుల గొంతుకను జాతీయస్థాయిలో వినిపించాలి.
నష్టాల్లోకి నెడుతున్నది కేంద్రమే
సమాచార వ్యవస్థలో రారాజైన బీఎస్ఎన్ఎల్, నేడు కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోవడానికి కేంద్ర పాలకులే ప్రధాన కారణం. దేశీయ సమాచార రంగం గొంతు నులిమేందుకు కేంద్రం పూనుకున్నది. దీనిని అడ్డుకొని తీరాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉన్నది.
కోచ్ ఫ్యాక్టరీ వస్తే వేల మందికి ఉపాధి
విభజన చట్టం ప్రకారం తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. బీజేపీ సర్కారు దానిని అమలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఎంతటి ఉద్యమానికైనా మేం సిద్ధం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి కలను సాకారం చేసిన విధంగానే, కేంద్ర ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఉద్యమించాలని
కోరుకుంటున్నాం.
లాభాలుంటే ప్రైవేట్కు.. నష్టాలుంటే జాతీయం..
మోదీ సర్కారు అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఏదీ లేదు. లాభాలున్న సంస్థలను ప్రైవేట్కు అప్పగించాలని కుట్రలు చేస్తున్నది. నష్టాలున్న సంస్థలను జాతీయం చేస్తున్నది. వేల కోట్ల ప్రజల సొమ్మును కొద్దిమంది కార్పొరేట్లకు అప్పనంగా దోచిపెడుతున్నది. కార్పొరేట్లు లక్షల కోట్లు రుణాలు ఎగవేసినా చోద్యం చూస్తున్నది. కేంద్రవిధానాల కట్టడికి ఐక్య ఉద్యమాలు చేయాలి. ఒకే వేదికపైకి వచ్చి గొంతు వినిపించాలి.
యువత భవిష్యత్ అంధకారమే..
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రక్షణ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కంకణం కట్టుకొన్నది. కేంద్రం విధానాలవల్ల యువత భవిష్యత్ అంధకారంగా మారనున్నది. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. ట్రేడ్ యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలి. ఆ పోరాటాలకు సీఎం కేసీఆర్ నేతృత్వం వహించాలి.
సామాజిక మాధ్యమాల్లోనూ సమరభేరి
ట్రేడ్ యూనియన్లన్నీ సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి. అందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యాన్ని చాటాలి. ప్రైవేటీకరణ వల్ల వాటిల్లే నష్టాలపై ప్రజలకు ఎలుగెత్తి చాటాలి.