కాలిఫోర్నియా: అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఖండించారు. గత ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు అమెరికాలో సుమారు మూడు వేల విద్వేష దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆసియన్ అమెరికన్ అడ్వకసీ గ్రూపు పేర్కొన్నది. 2019లో ఆ సంఖ్య కేవలం 216 మాత్రమే ఉన్నట్లు ఎఫ్బీఐ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం అమెరికాలో నమోదు అవుతున్న విద్వేష ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని సత్యా నాదెళ్ల తన ట్వీట్లోపేర్కొన్నారు. వర్ణవివక్ష, ద్వేషం, హింసకు ఈ సమాజంలో చోటులేదని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియన్లు, ఆసియా అమెరికన్ల సమాజానికి అండగా నిలుస్తున్నట్లు సత్యా నాదెళ్ల పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ దాడుల్ని ఖండించారు. ఆసియా అమెరికన్లపై దాడి దేశ విధానం కాదు అని, దీన్ని ఆపేయాలని బైడెన్ పిలుపునిచ్చారు.