Thalasani : తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్న అనేకమంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ, చలివేంద్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2011 నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు 70 రోజులపాటు ఎంతో రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వయసును లెక్కచేయకుండా సమాజానికి సేవ చేయాలనే సీనియర్ సిటిజన్ల లక్ష్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో అనేకమంది సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ సనత్నగర్లోని సీనియర్ సిటిజన్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారని అన్నారు.
కుటుంబసభ్యులతో గడపాల్సిన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంకల్పమని చెప్పారు. ఇక్కడ భోజనం తిని ఆకలి తీర్చుకుంటున్న పేదలు తమ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. తమ సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ సిటిజన్లు జీవితాంతం నా గుండెల్లో ఉంటారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వయసులో నా కంటే పెద్దవారైన మీ ఆశీస్సులు నాపై ఉండాలని వారిని కోరారు. తనను కలవడానికి వచ్చినప్పుడు శాలువాల కోసం డబ్బు వృథా చేయవద్దని అన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.