శ్రీశైలం : శ్రీశైల మల్లన్న క్షేత్రంలో బుధవారం నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్లైన్, కరెంటు బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఈఓ తెలిపారు.
ఆర్జిత కుంకుమార్చన, నవావరణ అర్చన, వృద్ధ మల్లికార్జునస్వామి వారి ఆర్జిత అభిషేకాలు పరిమిత సంఖ్యలో కొనసాగనున్నాయి. బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా అంటే ఉదయం 7 గంటలకు తొలి విడుత, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో విడుత, తిరిగి రాత్రి 7.30 గంటలకు మూడో విడుత బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. బ్రేక్ దర్శనానికి రూ.500 టికెట్గా నిర్ణయించారు. వేద ఆశీర్వచనం కూడా పునః ప్రారంభంకానుండగా.. రోజుకు నాలుగు విడుతలుగా వేద ఆశీర్వచనం నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని సూచించింది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని దేవస్థానం కోరింది. భక్తులకు నిరంతరం ఉచిత ప్రసాద వితరణ కొనసాగిస్తామని చెప్పింది. వేకువ జామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ ముగిసే వరకు భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తామని ఈఓ కేఎస్ రామారావు వివరించారు.