రాజన్న సిరిసిల్ల, మార్చి 8(నమస్తే తెలంగాణ)/ తంగళ్లపల్లి : పనిచేసేందుకు సర్పంచులు కావాలి గానీ, పంచాయతీలకు పైసలు మాత్రం ఇవ్వరా..? అంటూ సర్పంచులు అధికారులను నిలదీశారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో ఒక రోజు శిక్షణ నిర్వహించగా.. ఎస్పీ మహేశ్ బీగితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. అధికారులు కార్యక్రమాలను వివరిస్తుండగా.. సర్పంచులు నిరసన గళం ఎత్తారు.
పంచాయతీలకు నిధులు రావడంలేదని, ఎలా పనులు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోడ్డు కరాబైనా.. మోరీ బాగాలేకున్నా.. పందులు సచ్చిపోయినా.. ఆఖరికి ఎలుకలు సచ్చిపోయినా సర్పంచే కావాలే! కానీ, పైసలు మాత్రం రావు’ అని తంగళ్లపల్లి మండలం పద్మనగర్ సర్పంచ్ మోర నిర్మల ధ్వజమెత్తింది. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్ గుప్తా మాట్లాడుతూ.. యూరియా యాప్తో రైతులందరూ తిప్పలపడుతున్నారని తెలిపారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ సర్పంచ్ అంచె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు ఇవ్వకుండా పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.
వనపర్తి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రాజకీయాలకు గూండాలు కూడా అవసరమంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితోపాటు ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తనకు అప్పగించడం తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. మంచివాళ్లతోపాటు గూండాలు కూడా రాజకీయాలకు అవసరమంటూ చెప్పడంతో సభలోని వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ తీసుకున్నప్పుడు తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని పేర్కొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది.