సంగారెడ్డి, డిసెంబరు 7: ఎస్సై, కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, నేటి నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ తెలిపారు. బుధవారం అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, ఫిజికల్ టెస్ట్ చీఫ్ సూపరింటెండెంట్ బాలస్వామితో కలిసి పోలీస్ మైదానాన్ని పరిశీలించారు. అభ్యర్థుల విద్యార్హత ధ్రువ పత్రాల నమోదుకు కంపూటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులతో కలిసి ట్రయల్న్న్రు పరీక్షించారు. ఆర్హెచ్ఎఫ్ఐడీ, సెన్సార్ పద్ధతులతో లాంగ్జంప్, షాట్పుట్, ఎత్తు, కొలతలు తీసుకునే విధానాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు. రన్నింగ్ ట్రాక్తో పాటు మైదానం నిర్వహణపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల పత్రాల తనిఖీ మొదలు పరీక్షలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లేవరకు అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని ఎస్పీ సూచించారు. తమకు కేటాయించిన రోజు ఉదయం 5గంటలకు మైదానానికి చేరుకుని బయోమెట్రిక్, ధ్రువపత్రాల వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు పార్ట్-2 దరఖాస్తుపై సంతకం చేసి తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట సంగారెడ్డి, జహీరాబాద్ డీఎస్పీలు రవీంద్రారెడ్డి, రఘు, డీటీసీ డీఎస్పీ ప్రభాకర్, ఎఆర్ డీఎస్పీ జనార్దన్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మహేశ్గౌడ్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, టెక్నికల్ టీం సిబ్బంది ఉన్నారు.