కొత్తకాపు అశ్రుహ.. ఆర్మీలో చేరి, దేశ సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొన్నది. సైన్యంలో చేరేందుకు సాహస క్రీడలను మార్గంగా ఎంచుకొన్నది. అందులో భాగంగా పర్వతారోహణకు సిద్ధపడ్డది. భువనగిరి కోట నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆఫ్రికాలోని కిలిమంజారో పైకి చేరుకొన్నది. ఇక తన తదుపరి లక్ష్యం.. ఎవరెస్ట్ శిఖరమేనని ఎలుగెత్తి చెబుతున్నది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్కు చెందిన కొత్తకాపు అశ్రుహ పర్వతారోహణలో రాణిస్తున్నది. ఇటీవలే టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతున్నది. అశ్రుహ తండ్రి కొత్తకాపు నర్సింహారెడ్డి టెంట్హౌస్ వ్యాపారి, తల్లి లత గృహిణి. అశ్రుహకు బాల్యం నుంచే ఆర్మీలో చేరి, దేశ సేవ చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు సాహస క్రీడలు ఉపయోగపడతాయని, ఈ వైపుగా అడుగులేసింది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో లాంగ్ రన్ పోటీల్లో పాల్గొన్నది. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అశ్రుహ, ఎన్సీసీ శిక్షణ కూడా తీసుకొంటున్నది.
భువనగిరి నుంచే అడుగులు..
మియాపూర్లోని సెయింట్ మార్టిన్ కళాశాలలో ఎన్సీసీ శిక్షణ తీసుకుంటున్నది అశ్రుహ. తనలోని చలాకీతనాన్ని గుర్తించిన ఎన్సీసీ ట్రైనర్ పద్మజ.. పర్వతారోహణ దిశగా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా భువనగిరిలోని రాక్ క్లయింబింగ్ ట్రైనింగ్ స్కూల్లో చేరింది. ఇక్కడ లెవల్-1లో భాగంగా పర్వతారోహణకు సంబంధించిన బేసిక్స్ నేర్చుకొన్నది. లెవల్-2 శిక్షణలో ‘ఏ’గ్రేడ్ తెచ్చుకొన్నది. పర్వతారోహణలో అశ్రుహను మరింతగా రాటుదేల్చేందుకు ట్రైనర్లు రాకేశ్, శేఖర్బాబు ఆమెను సిక్కిం పంపించారు.
అక్కడి ఇండియన్ హిమాలయ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజమ్లో 28 రోజుల శిక్షణ తీసుకున్నది అశ్రుహ. మంచులో ఎలా నడవాలి? ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? పర్వతారోహణకు సంబంధించిన ఉపకరణాలను ఎలా వినియోగించాలనే విషయాలను నేర్చుకొన్నది. ఇక్కడ నిర్వహించిన పరీక్షలోనూ ‘ఏ’ గ్రేడ్ తెచ్చుకొని ముందంజలో నిలిచింది. శిక్షణలో భాగంగా సిక్కింలోని లఖోన్కా వ్యాలీ (5,193 మీటర్లు)ని ఒక్కరోజులోనే అధిరోహించి ‘ఔరా’ అనిపించుకొన్నది.
‘కిలిమంజారో’పైకి..
సిక్కింలో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొన్న అశ్రుహ, టాంజానియాలోని కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమైంది. అందుకోసం నవంబర్ 23వ తేదీన ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లింది. 27న రాత్రి 11 గంటలకు కిలిమంజారో బేస్క్యాంప్ చేరుకున్నది. అక్కడి నుంచి మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో పర్వతారోహణ ప్రారంభించింది. 28న ఉదయం 6.45 గంటలకు 5,895 మీటర్ల ఎత్తుకు విజయవంతంగా చేరుకొని, జాతీయ జెండాను ఎగురవేసింది.
దేశ సేవ కోసమే..
కిలిమంజారో పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేయడం గర్వంగా ఉంది. నా తదుపరి లక్ష్యం ఎవరెస్ట్ శిఖరమే! స్పాన్సర్స్ దొరికితే 2022 లేదా 23లో కచ్చితంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిగమిస్తా. ఆ నమ్మకం నాకుంది. డిగ్రీ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు రాస్తాను. సైన్యంలో చేరి, దేశ సేవ చేయాలన్నదే నా జీవితాశయం. నా విజయానికి కారణం నా తల్లిదండ్రులే. నా ఇష్టాయిష్టాలను వారు ఎప్పుడూ కాదనలేదు. ఆడపిల్లనని వివక్ష చూపలేదు. ఆంక్షలు పెట్టలేదు. నన్ను ఈ వైపుగా ప్రోత్సహించిన పద్మజ మేడమ్, రాకేశ్, శేఖర్బాబు సార్లకు ఎప్పటికీ రుణపడి ఉంటా.
కొత్తకాపు అశ్రుహ