శ్రీగంధం.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. నాటిన 15 నుంచి 20 ఏండ్ల తరువాత ఒకో మొకపై రూ. రెండు లక్షల దాకా ఆదాయం చేతికందనున్నది. దీంతో.. ఈ సుగంధ మొక్కల సాగుపై అన్నదాతల్లోనూ ఆసక్తి పెరుగుతున్నది. ‘శ్రీగంధం’ సాగునుప్రోత్సహించేందుకు తెలంగాణ ఉద్యాన శాఖ చొరవ చూపుతున్నది.
ప్రపంచంలోని ఖరీదైన వృక్ష జాతుల్లో శ్రీగంధం ఒకటి. ఈ చెట్టు బెరడు, మధ్యలోని చేవ, చెట్టు వేర్లు.. ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే! దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంతోపాటు వివిధ సుగంధ ద్రవ్యాలు, ఖరీదైన సబ్బుల తయారీలో వాడుతున్నారు. ఇంతకుముందు గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపైనే ఆధారపడేవారు. కానీ, అడవుల నరికివేత, అక్రమ రవాణా వల్ల గంధపుచెట్ల సంపద తరిగిపోతున్నది. ఫలితంగా ఈ చెట్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. గతంలో శ్రీగంధం మొక్కల పెంపకానికి అనుమతి ఉండేది కాదు. కానీ, విలువైన ఈ వృక్ష సంపద అంతరించి పోతుండటంతో శ్రీగంధం సాగుకు కేంద్ర ప్రభుత్వమే రైతులను ప్రోత్సహిస్తున్నది. మొకలు నాటే సమయంలో అనుమతి అవసరం లేకున్నా, చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం ఎనిమిది దేశాల్లో మాత్రమే శ్రీగంధం సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండగా, అందులో మన దేశంకూడా ఒకటి. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు శ్రీగంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు తేలింది.
శ్రీగంధం మొక్కలను ఏ సీజన్లోనైనా నాటుకోవచ్చు. అయితే, శీతకాలంలో వీటిని నాటుకోవడం మంచిది. నేల స్వభావాన్ని బట్టి 2-3 సార్లు అడ్డం, నిలువుగా దున్నుకొని, భూమిలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒక్కో మొక్క మధ్య కనీసం నాలుగు లేదా ఐదు మీటర్ల దూరం వచ్చేలా 45 సెం.మీ. x 45 సెం.మీ. చొప్పున గుంతలు తవ్వుకోవాలి. ప్రతి గుంతలోనూ రెండు కిలోల పశువుల ఎరువు (బాగా చిలికిన), కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్, కిలో వేప పిండి వేసుకోవాలి. ఒకవేళ చెదల సమస్య ఉన్నట్లయితే, గుంతల్లో లిండేన్ (3%) 100 గ్రా. వేయాలి. ఆ తర్వాత 2-3 నెలల వయస్సు, 7-8 ఆకులు ఉన్న శ్రీగంధం మొక్కలను నాటుకోవాలి.
శ్రీగంధం పరాన్నజీవి. తనకు అవసరమైన పోషకాలను భూమి నుంచి స్వయంగా పొందలేదు. అందుకోసం ఆతిథేయి మొక్కలపై ఆధారపడుతుంది. కాబట్టి, శ్రీగంధం తోటల్లో ఉసిరి, నిమ్మ, జామ, నేరేడు, మామిడిలాంటి ఆతిథేయి మొక్కలను నాటుకోవాల్సిందే. శ్రీగంధం మొక్కలు నాటిన 3-4 నెలల తరువాత, ప్రధాన మొక్కకు 1-2 మీ. దూరంలో ఆతిథేయి మొక్కను నాటుకోవాలి. ఇలా ఒక ఎకరంలో 300 శ్రీగంధం, 300 ఆతిథేయి మొక్కలను నాటుకోవచ్చు. నాటిన రెండు నుంచి రెండున్నరేండ్లలో శ్రీగంధం మొక్కలు 2 నుంచి 2.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
శ్రీగంధం మొక్కలు సహజసిద్ధంగానే ఎటువంటి వ్యాధులు రాకుండా పెరుగుతాయి. అయితే, మొక్కలకు నష్టాన్ని కలిగించే క్రిమి కీటకాలు కనిపిస్తే, వాటి నివారణకు వేపగింజల కషాయం, చిత్రమూలం, ఉమ్మెంత లేదా గోమూత్రం లాంటివి వాడితే సరిపోతుంది. ముందస్తు చర్యగా జీవశిలీంధ్ర క్రిమి నాశనులైన వర్టీసీలియం, సూడోమోనాస్ కూడా వాడుకోవచ్చు. అంతర కృషి ద్వారా కలుపును నివారించుకోవడమే మంచిది.
అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే శ్రీగంధం మొక్కలకు ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అయితే, మనం నాటిన మొక్కల విషయంలో మాత్రం సహజ సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచుతూ, వాటి వేరు వ్యవస్థను బలపరిస్తే సరిపోతుంది. కానీ, మొక్క పెరుగుదల సరిగ్గా లేకుంటే, పోషకాలు అందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం ప్రధాన ఆతిథేయి, శ్రీగంధం మొక్కల మధ్యలో జూన్-జులై, అక్టో
బర్-నవంబర్ మాసాల్లో రెండు విడతలుగా పశువుల ఎరువు 5 కిలోలు, వేపపిండి 1 కిలో, నత్రజని 200 గ్రా, భాస్వరం 250 గ్రా., పొటాష్ 250 గ్రా. చొప్పున అందించాలి. అలా మొక్క నాటిన ఐదేండ్ల వరకూ పోషకాలను అందిస్తే, నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.
నేల స్వభావం, అనుకూల వాతావరణం, యాజమాన్య పద్ధతులను బట్టి శ్రీ గంధం మొక్కలు 20 నుంచి 30 ఏండ్లకు మంచి దిగుబడిని ఇస్తాయి. 10 నుంచి 15 ఏండ్ల చెట్ల కాండంలో మంచి చేవ (కాండం మధ్యలో ఉండే పదార్థం) వస్తుంది. ఈ చేవ ఎంత ఎక్కువగా ఉంటే, ధర అంత అధికంగా వస్తుంది. నాణ్యత, డిమాండ్ను బట్టి కిలో రూ.6వేల నుంచి రూ.8వేల వరకూ పలుకుతుంది. ఒక చెట్టుకు 20 కిలోల చేవ వచ్చినా, ఎకరానికి 6వేల కిలోల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఒక ఎకరంలో రూ.3కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, శ్రీగంధం తోటల్లో ఉసిరి, మామిడి,
బత్తాయిలాంటి ఆతిథేయి మొక్కలూ సాగవుతుంటాయి. కాబట్టి, వీటి ద్వారా ఏడాదికి ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంటుంది. దీర్ఘకాలంలో సురక్షితమైన రాబడిని ఇచ్చే పంట ఇది. కాబట్టి, రైతులు ధైర్యంగా శ్రీగంధం సాగు చేయవచ్చని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
శ్రీగంధం మొకలతో సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యానశాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని వ్యవసాయ క్షేత్రం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. శ్రీగంధం సాగు చేయాలనుకునే రైతులకు, ఈ క్షేత్రం మార్గదర్శిగా నిలుస్తున్నది. మొక్కలు నాటడం, అంతర పంటల సాగు, నీరు పారించడం, ఎరువులు వేయడంలాంటి వివిధ దశలను కండ్లకు కడుతున్నది. చీడ పీడల నివారణ చర్యలపైనా అవగాహన కల్పిస్తున్నది. అంతేకాకుండా, రైతులకు తకువ ధరకే
నాణ్యమైన మొకలనూ అందిస్తున్నది. శ్రీగంధం రైతులకు ఇదో దర్శనీయ కేంద్రం.
రైతును రాజుగా చూడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వివిధ సబ్సిడీలు అందిస్తున్నది. అయితే, ప్రకృతి వైపరీత్యాలతో సంప్రదాయ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రాక, రైతులు అప్పులపాలు అవుతున్నారు. అందుకే, లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులు వేయాలి. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే శ్రీగంధం లాంటివి సాగు చేయాలి. ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.. తెలంగాణ రైతులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నది. ఆసక్తి ఉన్నవారికి నాణ్యమైన మొక్కలతోపాటు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నది.
–ఎన్. పద్మనాభ, ఏడీ, ఉద్యాన శాఖ
–మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి