హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదని, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణకు రైల్వే కొత్త లైన్ల మంజూరు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఆయన గురువారం లేఖ రాశారు. రానున్న రైల్వే బడ్జెట్లోనైనా తెలంగాణకు కొత్త రైల్వే లైన్లను మంజూరుచేయాలని డిమాండ్చేశారు. తెలంగాణ.. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల రాష్ట్రమని, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం తెలంగాణకు వలస వస్తున్నారని వినోద్కుమార్ వివరించారు. దీనికి తోడు తెలంగాణలో పుషలంగా నీళ్లు, విద్యుత్తు లభ్యత ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తెలంగాణకు వలసలు వాపస్ వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నందున రాష్ర్టానికి రైల్వే కొత్త లైన్లను మంజూరుచేయాలని డిమాండ్చేశారు.
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ మాత్రమే మంజూరైందని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని సమకూర్చి, మూడోవంతు నిర్మాణ ఖర్చును భరించినందుకే వచ్చిందని వినోద్ గుర్తుచేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 13వ సెక్షన్ ప్రకారం.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆర్నెళ్లలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని స్పష్టంగా ఉన్నప్పటికీ.. అది ఇప్పటివరకు అతీగతీ లేకుండా పోయిందని వినోద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పితే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైల్వే కొత్త లైన్ల కోసం 11 ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని, ఏవో కుంటిసాకులు చెప్తూ రైల్వే శాఖ రాష్ట్ర ప్రతిపాదనలను పకన పెట్టిందని విమర్శించారు. సంవత్సరాలు గడుస్తున్నా చలించడం లేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లతో పాటు మరో 25 లైన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్ల క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలను పంపిన విషయాన్ని వినోద్ తన లేఖలో గుర్తుచేశారు. డీపీఆర్ పూర్తయిన ఈ ప్రతిపాదనల మంజూరు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. తెలంగాణ పట్ల ఇప్పటికైనా వివక్ష మానుకొని, రానున్న రైల్వే బడ్జెట్లో కొత్త లైన్లను మంజూరు చేయాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు.