‘సినిమాటోగ్రఫీ మహాసముద్రం వంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలంటే ప్రతి రోజు అప్డేట్ కావాల్సిందే’ అన్నారు ముజీర్ మాలిక్. ఆయన ఛాయాగ్రహణం సమకూర్చిన తాజా చిత్రం ‘ధగడ్ సాంబ’. సంపూర్ణేష్బాబు కథానాయకుడిగా నటించారు.
ఎన్.ఆర్.రెడ్డి దర్శకుడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం సినిమాటోగ్రాఫర్ ముజీర్మాలిక్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ప్రముఖ గాయకుడు మనో నాకు బావ అవుతాడు. ఆయన ప్రోత్సాహంతోనే ఛోటా కె నాయుడు దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా చేరాను. ‘మగరాయుడు’తో ఆయన దగ్గర మొదలైన నా ప్రయాణం ‘అదుర్స్’ చిత్రం వరకూ సాగింది.
అనంతరం ‘యువరాజ్యం’ ‘మన కుర్రాళ్లు’ ‘మేరా భారత్ మహాన్’ గోలి సోడా’ ‘కొబ్బరిమట్ట’ ‘క్యాలీఫ్లవర్’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశా. నేను ఛాయాగ్రహణం అందించిన ‘కడైసి బెంచ్ కార్తీ’ తమిళ చిత్రానికి మంచి పేరొచ్చింది. ‘ధగడ్ సాంబ’ యాక్షన్ అంశాలున్న చిత్రం. సంపూర్ణేష్బాబు కొత్తగా కనిపిస్తాడు. ఫైట్స్ కూడా బాగా చేశాడు. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. వృత్తిపరంగా కూడా నాకు ఎంతో సంతృప్తినిచ్చిందీ చిత్రం. ఈ సినిమా తర్వాత ‘బ్రిలియంట్ బాబు’ ‘సన్నాఫ్ తెనాలి’ ‘దాన వీర శూరకర్ణ’ చిత్రాలు చేస్తున్నా’ అన్నారు.