Shyam Pitroda | సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ కమిటీ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదించారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాత వారసత్వ పన్నుపై శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికాలో వారసత్వ పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి వద్ద 100 మిలియన్ డాలర్ల విలువైన సొత్తు ఉంటే, ఆయన మరణం తర్వాత అందులో 45 శాతం మాత్రమే ఆయన వారసులకు బదిలీ చేసి, మిగతా 55 శాతం సొత్తు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన అంశం. న్యాయంగానే ఉంది’ అని అన్నారు.
తాజాగా భారత్లో భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా స్పందిస్తూ ‘తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వారు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండి పడింది.