( స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలకు విరాళాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో మరో వివాదం బయటపడింది. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందేది రాజకీయ పార్టీలైతే, వాటిని అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ లాభం పొందుతున్నది స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదే సమయంలో ఈ కమీషన్తో పాటు బాండ్ల ప్రింటింగ్, ఇతరత్రా ఖర్చులకు కూడా ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న ధనాన్ని కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఈ విషయం ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచార హక్కు కార్యకర్త లోకేష్ బాత్రాకు కేంద్ర ఆర్ధిక వ్యవహారాల విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నుంచి ఇప్పటికి 22 దశల్లో అనామక దాతల నుంచి పార్టీలకు రూ.10,791.5 కోట్లు బాండ్ల ద్వారా అందాయి. అయితే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుల నుంచి బాండ్లు అమ్మే ఎస్బీఐ బాండ్ విలువ కంటే అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయదు. ఇప్పటి వరకు బాండ్ల ప్రింటింగ్ కోసం రూ.7.63 కోట్లు ఖర్చు కాగా, మరో 1.9 కోట్ల జీఎస్టీతో కలిసి మొత్తం రూ.9.53 కోట్లు ఖర్చయ్యాయి. బాండ్ల విక్రయానికయ్యే ఈ ఖర్చంతా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన ప్రజాధనమని తేలింది.