దక్షిణాది భాషల్లో ప్రతిభావంతురాలైన కథానాయికగా గుర్తింపును తెచ్చుకుంది తమిళ సోయగం సాయిపల్లవి. సహజమైన అభినయానికి చిరునామాగా ఈ భామను అభివర్ణిస్తారు. కథాంశాల ఎంపికలో వైవిధ్యం, కొత్తదనంతో కూడుకున్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ను కొనసాగిస్తున్నది. దక్షిణాదిన తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నది. ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించింది.
‘బాలీవుడ్లో చాలా మంది దర్శకులతో పనిచేయాలనుంది. సంజయ్లీలాభన్సాలీ శైలి నాకు బాగా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఏ భాషా చిత్రమైనా అంతిమంగా నేను కథకే ప్రాధాన్యతనిస్తాను. బాలీవుడ్లో మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా. నా మనసుకు నచ్చిన కథ దొరికితే హిందీలో అరంగేట్రం చేస్తా’ అని చెప్పింది. అలాగే దక్షిణాదిన మణిరత్నం దర్శకత్వంలో నటించాలనుకుంటున్నానని పేర్కొంది. ఆమె కథానాయికగా నటించిన ‘శ్యామ్సింగరాయ్’ ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన విషయం తెలిసిందే.