తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద బుధవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.
ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.