సికింద్రాబాద్, నవంబర్ 24: చీటింగ్ కేసులో సాబూ కార్స్ సంస్థ వర్కింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సాబూను కార్ఖానా పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రవీందర్ కథనం ప్రకారం సికింద్రాబాద్లోని సిఖ్విలేజ్లో నివసించే కె. వీరేందర్రెడ్డి కూడా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. జూలై నెల నుంచి రెండు కార్లకు సంబంధించిన రుణాలు కట్టడం లేదని, ఏఎస్ రావునగర్కు చెందిన సుందరం ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటికి రావడంతో షాక్కు గురయ్యాడు. తాను ఎటువంటి కారు లోన్లు తీసుకోలేదని, అతను సదరు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులకు తెలిపాడు. మారేడుపల్లికి చెందిన ప్రశాంత్ సాబూ అనే వ్యాపారి మీ గ్యారంటి సంతకంతో రెండు కార్ల లోన్లు రూ. 40లక్షలు తీసుకున్నాడని సిబ్బంది తెలిపారు. దీనికి సంబంధించి వీరేందర్రెడ్డి సంతకాలతో కూడిన లోన్ డాక్యుమెంట్లను చూపించారు. ఈ విషయంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వీరేందర్రెడ్డి ఈ నెల 16వ తేదీన తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని కార్ఖానా పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ సాబూపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ సాబూను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.