హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు ఉత్సాహంగా సాగిన రైతుబంధు సంబురాలు ఘనంగా ముగిశాయి. సంబురాల్లో భాగంగా 14 రోజుల ముందుగానే పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించుకొన్నది. పల్లెపల్లెన ఊరూవాడా కోలాహలంగా కనిపించాయి. రైతుల పెట్టుబడి గోస తీర్చేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంపిణీ చేసిన మొత్తం ఈ సీజన్తో రూ.50 వేల కోట్లు దాటాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఈ నెల 3 నుంచి సంక్రాంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలను ఆ పార్టీ నిర్వహించింది. సంబురాల్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహిళలు సైతం ఉత్సవాల్లో పాల్గొని రంగవల్లులు వేశారు. విద్యార్థులు రైతుబంధు అంశాలపై పోటీల్లో పాల్గొన్నారు. రైతులు ప్రతి గ్రామంలో ఎడ్ల బండ్లతో, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సంబురాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. రైతువేదికల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు నేరుగా చేరే ఒక ప్రభుత్వం పథకం ఇంత భారీ మైలురాయిని చేరుకోవడం దేశవ్యాప్తంగా ఇదే ప్రథమం.