చౌటుప్పల్ రూరల్, మార్చి 1: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులు బాగున్నాయని మహారాష్ట్రలోని పుణె ఉన్నతస్థాయి అధికారులు ప్రశంసించారు. పల్లె ప్రగతి పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మంగళవారం వారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం స్థానికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధుల గురించి తెలుసుకొన్నారు. అంతకుముందు ఎల్లంబావి గ్రామ పరిధిలో మిషన్ భగీరథ సంప్ను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనితీరును కొనియాడారు. క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన వారిలో పుణె జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో మిలింద్ తాండెతోపాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.