ముంబై, నవంబర్ 29: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. ఒకవైపు ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుండటం, మరోవైపు పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండటం ఫారెక్స్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఐదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 74.84 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు చివరకు 18 పైసల నష్టంతో 75.07 వద్ద ముగిసింది. వరుసగా మూడోరోజు పతనం చెందినట్లు అయింది. వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వు తీసుకునే నిర్ణయం కోసం పెట్టుబడిదారులు వేచి చూసే దోరణి అవలంభిస్తున్నారని, మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాలున్నట్లు వచ్చిన సంకేతాలు రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి.
మార్కెట్లు ముందుకు
రూపాయి భారీగా పతనమైనప్పటికీ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 153.43 పాయింట్లు అందుకొని 57,260.58 వద్ద నిలిచింది. మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 27.50 పాయింట్లు పెరిగి 17,053.95 వద్దకు చేరుకున్నది. ప్రారంభంలో ఒక్క శాతానికి పైగా నష్టపోయిన సూచీలు చివర్లో మదుపరులు కొనుగోళ్ళకు మొగ్గుచూపడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 4.29 శాతం లాభపడి 75.84 డాలర్లు పలికింది. కొటక్ బ్యాంక్ షేరు 2.92 శాతం లాభపడగా, రిలయన్స్ 1.26 శాతం, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రాలు లాభాల్లో ముగిశాయి.