ముంబై, ఏప్రిల్ 16: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే 17 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.61 వద్ద నిలిచింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 83.48 రికార్డు కనుమరుగైపోయింది. గత నెల మార్చి 22న ఈ కనిష్ఠ రికార్డు నమోదైన విషయం తెలిసిందే. కాగా, స్టాక్ మార్కెట్ల నష్టాలు, డాలర్లకు డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలోనే రుపీ ఈ స్థాయిలో పతనమైందని ఫారెక్స్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఉదయం ఆరంభం నుంచే రుపీ నష్టాల్లో ట్రేడైంది. సోమవారం 83.44 వద్ద ముగిసినా.. మంగళవారం 83.51 వద్ద మొదలైంది.
రూపాయి విలువ ఇలాగే పడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందన్న ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులు, సేవలు ఖరీదెక్కుతాయని, ఇది ద్రవ్యోల్బణానికి దారితీయగలదంటున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే వడ్డీరేట్లను హైలోనే ఉంచుతున్న ఆర్బీఐ.. మరికొంత కాలం కోతల జోలికి పోదని, అప్పుడు రుణ భారం పెరిగి అన్ని రంగాలు కుదేలవుతాయన్న అంచనాలున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెన్సెక్స్ 456.10 పాయింట్లు నష్టపోయి 72,943.68 వద్దకు జారుకున్నది. నిఫ్టీ 124.60 పాయింట్లు కోల్పోయి 22,147.90 వద్దకు పడి పోయింది. ఇక గత మూడు సెషన్లలో రూ.8 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. కాగా, శ్రీ రామనవమి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు మూసివేసివుంచనున్నారు. తిరిగి గురువారం స్టాక్ ఎక్సేంజ్లు తెరుచుకోనున్నాయి.