ముంబై, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా మిలటరీ దాడిని ప్రారంభించిన ప్రభావంతో రూపాయి నిలువునా పతనమయ్యింది. గురువారంనాడిక్కడ ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో అమెరికా డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా 99 పైసలు మేర పడిపోయింది. యుద్ధం కారణంగా రిస్క్ కలిగిన సాధనాల్ని ఇన్వెస్టర్లు విక్రయిస్తుండటంతో ఇతర వర్థమాన దేశాల కరెన్సీల బాటలోనే రూపాయి విలువ కూడా తగ్గిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అమెరికా డాలరుతో 75.02 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 75.75 కనిష్ఠస్థాయికి క్షీణించింది. చివరకు 99 పైసల నష్టంతో 75.60 వద్ద ముగిసింది. చమురు ధర భారీగా పెరగడంతో ఇంధన దిగుమతి కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, క్లిష్ట సమయాల్లో సురక్షితంగా పరిగణించే డాలరు పెరగడం కూడా రూపాయి క్షీణతకు కారణమని డీలర్లు వివరించారు. డాలర్ ఇండెక్స్ 0.74 శాతం పెరిగి 96.90 వద్దకు చేరింది.