లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జైలు రణరంగాన్ని తలపించింది. ఖైది మృతి చెందడంతో కోపోద్రిక్తులైన తోటి ఖైదీలు జైలుకు నిప్పుపెట్టారు. సిబ్బందిపై రాళ్లదాడికి దిగారు. అక్కడికి వచ్చిన జైలర్తోపాటు పోలీసులపై దాడి చేశారు. ఘటనలో 30 మంది పోలీసులతో పాటు.. ఖైదీలు గాయాలకు గురయ్యారు. వారందరినీ ఆసుప్రతిలో చేర్పించారు. ఘటన వివరాల్లోకి వెళితే.. మేరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సందీప్ హత్య కేసులో జిల్లా జైలులో ఉన్నాడు.
సందీప్ డెంగీ బారినపడ్డాడు. పరిస్థితి విషమించడంతో సైఫాయి దవాఖానకు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జైలులో ఉన్న తోటి ఖైదీలు వీరంగం సృష్టించారు. జైలుకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న జైలర్, ఇతర పోలీసులపై జైలుకు చేరుకోగా.. వారికి దాడి చేశారు. డెప్యూటీ జైలర్ శైలేష్కుమార్ సోంకర్పై దాడికి దిగారు. ఈ క్రమంలో ఖైదీలను అదుపు చేసేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
జైలు నుంచి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు శబ్దాలు వచ్చాయి. విషయం తెలుసుక్ను సీఓసీటీ ప్రదీప్ సింగ్, ఫతేఘర్ కోత్వాల్ జైప్రకాశ్ పాల్ బలగాలతో జైలుకు చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు జైలు అలారం నిరంతరాయంగా మోగింది. అయితే, ఖైది సందీప్కు సకాలంలో వైద్యం అందలేదని, దీంతో అతడు చనిపోయాడని ఖైదీలో ఆరోపిస్తున్నారు. దీపావళి రోజున సరైన ఆహారం ఇవ్వలేదని, పండుగ రోజున ప్రాంగణం తెరుకపోవడంతో ఖైదీలు చుట్టూ ఉన్న వారిని కూడా కలువలేకపోయారని పేర్కొంటున్నారు.
ఘటనపై ఫతేఘర్ సెంట్రల్ జైలు సీనియర్ సూపరింటెండెంట్ ప్రమోద్ శుక్లా మాట్లాడుతూ.. ఖైదీ సందీప్ యాదవ్ సైఫాయ్ పీజీఐలో చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఖైదీ మృతి చెందిన సమాచారం అందిన వెంటనే జైలులో కలకలం రేగిందని, జైల్లో ఖైదీలు రాళ్లు రువ్వారని, నిప్పు పెట్టారన్నారు. సకాలంలో జైలు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారన్నారు.
ఖైదీ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై డీజీ ఆనంద్కుమార్ నివేదిక కోరారు. అలాగే డీఐజీ బీపీ త్రిపాఠిని సంఘటనపై విచారణ కోసం డీజీ ఫతేఘర్కు పంపారు. జైలులో ఉన్న సందీప్ యాదవ్ అనే ఖైదీ గత రాత్రి డెంగ్యూతో మరణించాడని ఆనంద్ కుమార్ తెలిపారు. జైలులో అల్లర్లకు దిగిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.