హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్న దీపక్ మునిస్వామిని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. ఈ మేరకు శుక్రవారం సదరు ప్రయాణికుడి ఫొటోను సజ్జనార్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో ఉండే దీపక్ మునిస్వామి తన రోజువారీ పనులకు ఆర్టీసీ బస్సునే వినియోగిస్తున్నారు. తాను వినియోగించడమే కాకుండా ప్రజలంతా వీలైనంత వరకు ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్యకు చెక్పెట్టవచ్చని, అదేవిధంగా వాయు కాలుష్యం, శబ్దకాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఓ పేపర్పై రాసి దాన్ని తన బ్యాగ్ వెనుక పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. తోటి ప్రయాణికులు సైతం దీపక్ మునిస్వామి అభినందిస్తున్నారు.