హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో అనుసరిస్తున్న అకౌంటింగ్ మాయాజాలం ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నది. ప్రత్యేకించి స్థానిక సంస్థలకు అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో కేంద్రం ఇచ్చే గ్రాంట్స్కు సమానంగా, కొన్నిసార్లు అధికంగా మ్యాచింగ్ గ్రాంట్లను నాటి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. 2021-22లో 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం రూ.1,365 కోట్లు ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) ద్వారా రూ.1,607.56 కోట్లు విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.1,415 కోట్లు విడుదల చేస్తే, మరో 40 కోట్లు అదనంగా కలిపి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,456.55 మంజూరుచేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2020-21 నుంచి 2022-23 వరకు మూడేండ్లలో రూ.4,627 కోట్లు విడుదల చేస్తే, నాటి కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లు అదనంగా అంటే రూ.4,911 కోట్లు మంజూరుచేసింది. ఫలితంగా నాడు పల్లెప్రగతి పరుగులు పెట్టింది. జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట పడింది.
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధుల కంటే నాటి కేసీఆర్ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను విడుదల చేసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఇచ్చినన్ని నిధులను కూడా మ్యాచింగ్ గ్రాంట్లుగా ఇవ్వడం లేదని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2020-21లో రూ.1,847 కోట్లుగా ఉన్న మొత్తం నిధుల విడుదల, 2025-26 నాటికి కేవలం రూ.619.85 కోట్లకు పడిపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. గడిచిన రెండేండ్లలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద రాష్ర్టానికి రూ.1,900 కోట్లు విడుదల చేసింది. కానీ, రేవంత్ సర్కార్ కేవలం రూ.1,011 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇవి కూడా సిబ్బంది వేతనాల కోసం మళ్లించి వాటినే మ్యాచింగ్ గ్రాంట్లుగా లెక చూపినట్టుగా అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. అంటే కొత్తగా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించకుండా, కేవలం జీతాలనే చెల్లించి వాటినే గ్రాంట్లుగా చూపించడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కుంటుపడుతుంది. కాంగ్రెస్ పాలనలో నిధుల మళ్లింపు కొత్త పుంతలు తొకుతున్నదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి చేరాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా గ్రాంట్లను వేతనాలకు సర్దుబాటు చేయడం వల్ల గ్రామాల్లో కొత్త పనులు చేపట్టడానికి నిధుల్లేక సర్పంచ్లు, స్థానిక ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కేవలం కాగితాలపైనే మ్యాచింగ్ గ్రాంట్లు కనిపిస్తున్నా, అవి ప్రజోపయోగ పనులకు కాకుండా నిర్వహణ ఖర్చులకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
