యాదాద్రి, నవంబర్ 18 : సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మహాద్భుతమైన యాదాద్రి పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ పలువురు దాతలు, అధికారులు తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి ఆలయ విద్యుత్తు విభాగం ఈఈ వీవీ రామారావు రూ.50వేల చెక్కును ఈవో గీతకు గురువారం అందించారు.
యాదాద్రి, నవంబర్ 18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో భారీగా విరాళాలు వస్తున్నాయి. గత అక్టోబర్ 19న యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు ఇచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచి, క్యూఆర్ కోడ్ను అందుబాటులో ఉంచారు. దీంతో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి గత నెల 28న యాదాద్రికి వచ్చి మొదటి విడుతలో రూ.1.82 కోట్ల విరాళాలను ఈవో గీతకు అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రకటనకు ముందు నుంచే ఆలయ అధికారులు సెప్టెంబర్ 25 నుంచే విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు భక్తులు, మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన విరాళాలను కలుపుకొని రూ.3,03,35,059 సమకూరినట్టు ఆలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.