హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 : రైల్వే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. దేశవ్యాప్తంగా 35,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే.. నాలుగేండ్లయినా ఒక్కపోస్టును నింపలేకపోయింది. గందరగోళ నిబంధనలు, అస్పష్ట నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. తిరుగబడుతున్న నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అభ్యంతరాల స్వీకరణ పేరుతో కాలయాపనకు తాజాగా తెరలేపింది. రైల్వే జోన్లవారీగా ఉండే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులను (ఆర్ఆర్బీ) కాదని దేశవ్యాప్తంగా 20 ఆర్ఆర్బీలను ఏకంచేసిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ).. సెంట్రల్ నోటిఫికేషన్ పేరుతో 2019 జనవరిలో 35,281 నోటిఫికేషన్ జారీచేసింది. కొన్ని క్యాటగిరీ పోస్టులకు ఇంటర్, మరికొన్ని క్యాటగిరీ పోస్టులకు డిగ్రీ విద్యార్హత ప్రకటించింది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా కోటిమందికిపైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 2020 నుంచి జూన్ 2021 వరకు దాదాపు ఆరు నెలలపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ-1)లు నిర్వహించారు. వాటి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేశారు. సీబీటీ-1 నుంచి సీబీటీ -2 ఎంపికచేసే క్రమంలో 1:20 నిష్పత్తి ప్రకారం 7,05,446 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. నాన్ టెక్నికల్ పోస్టులకు ఎవరు అర్హులు? ఎవరు కాదు? సీబీటీ-1 పరీక్షలు ఫలితాల్లో సీబీటీ-2 పరీక్షలకు ఎంత మందిని ఎంపిక చేయాలి? ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలి? వంటి అంశాలు నోటిఫికేషన్లో స్పష్టంగా వెల్లడించలేదని అభ్యర్థులు ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. నాన్ టెక్నికల్ సీబీటీ-1 ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిదంటూ నిరుద్యోగులు అందోళనకు దిగారు. నోటిఫికేషన్లో ప్రకటించిన నిబంధనల ప్రకారం అభ్యర్థులను సీబీటీ-2కు ఎంపిక చేయలేదంటున్నారు. ఇంటర్ అభ్యర్థులకు దక్కాల్సిన నాన్ టెక్నికల్ పోస్టులన్నీ డిగ్రీ అర్హతలు ఉన్నవారికే దక్కుతున్నాయని, వారిని మాత్రమే 1:20 నిష్పత్తిలో సీబీటీ-2కు ఎంపిక చేసినట్టు నిరుద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కోచింగ్ కేంద్రాలతో రైల్వే అధికారులు కుమ్మక్కు వల్లే ఈ గందరగోళం ఏర్పడిందన్న ఆరోపణలున్నాయి.
అభ్యంతరాలపై కాలయాపన కమిటీ..
పరీక్షలకు హాజరైన అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని అధికారులు ఏర్పాటుచేశారు. అభ్యంతరాలు ఈ కమిటీకి తెలియజేయాలని, దానిని పరిష్కరించి.. తుది ఫలితాలు విడుదలకు కమిటీ పనిచేస్తుందని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఇంటర్మీడియట్ వారికి న్యాయం చేయకుండా కొందరి స్వార్థం కోసం కావాలనే గందరగోళం సృష్టించే విధంగా ఫలితాలు విడుదల చేసినట్టు చెప్పుతున్నారు. 35,281 పోస్టుల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ పరిధిలో 3,234 పోస్టులు ఉన్నాయి. వీటికి 11 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులలో 1:20 ప్రకారం క్యాటగిరీలవారీగా 64,680 మందిని సీబీటీ-2 కు ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులు చాలా మందే ఉన్నారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తలెత్తిన గందరగోళంతో ఈ నియామకాలు ప్రస్తుతం ఆగిపోయాయి. తిరిగి ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియని అయోమయం అభ్యర్థుల్లో నెలకొన్నది.